ఇన్నాళ్లూ గతుకులమయంగా ఉన్న రోడ్లన్నీ.. రయ్ రయ్ మనేలా మారిపోయాయి. రోడ్డు పక్కనే ఉన్న ముళ్లకంపలన్నీ మాయమై.. రంగురంగుల పూల మొక్కలు, పచ్చని చెట్లు పల్లెకు స్వాగతం పలుకుతున్నాయి. ఎక్కడికక్కడ పేరుకుపోయి దుర్వాసన వెదజల్లే చెత్తంతా.. ఉదయాన్నే డంపింగ్ యార్డుకు తరులుతున్నది. రోడ్లపై పారే మురుగునీరు అండర్ డ్రైనేజీల నిర్మాణంతో కనుమరుగైపోయింది.. ఇలా ఒకటేమిటీ.. పల్లెల్లో ప్రగతి పరిఢవిల్లుతున్నది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో జిల్లాలోని ప్రతి పల్లె ప్రగతి ముల్లెగా మారింది. వెరసి నగర శివారులోని పల్లెలన్నీ పట్నాలకు తీసిపోని విధంగా మెరిసిపోతున్నాయి.
మేడ్చల్, జనవరి19 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్ జిల్లాలోని గ్రామపంచాయతీలలో పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్యార్డుల నిర్మాణాలను రూ. 13 కోట్ల 80 లక్షల నిధులతో చేపట్టారు. మేడ్చల్, ఘట్కేసర్, మూడుచింతలపల్లి, శామీర్పేట్, కీసర మండలాలలోని 61 గ్రామ పంచాయతీలలో 61 వైకుంఠధామాలు, 61 డంపింగ్యార్డులు నిర్మించి, 81 పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. వైకుంఠధామాలకు రూ. 7కోట్ల 32 లక్షలు, డంపింగ్యార్డులకు రూ. 6 కోట్లు, పల్లెప్రకృతి వనాలకు రూ. 48 లక్షల 71 వేలను ఖర్చు చేశారు. 61 వైకుంఠధామాల్లో అన్ని నిర్మాణాలు పూర్తయినప్పటికీ 58 అందుబాటులోకి రాగా, మరో మూడు త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. డంపింగ్యార్డులన్నీ అందుబాటులోకి వచ్చాయి. పల్లెప్రకృతి వనాలతో పల్లెలన్నీ పచ్చందాలతో కనువిందు చేస్తున్నాయి. పారిశుధ్యం, పల్లెప్రకృతి వనాల అభివృద్ధిపై ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ పల్లెల అభివృద్ధికి సహకరిస్తున్నారు.
పల్లెల్లో పచ్చదనం పెరిగింది
తెలంగాణ రాష్ట్రంలో అటవీ సంపద పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే. పల్లెప్రకృతి వనాలతో పాటు హరితహారం కార్యక్రమాలతో పచ్చదనం పెరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో చెయలేని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పల్లెప్రకృతి వనాల ఏర్పాటుతో పల్లెల రూపురేఖలు మారాయి. మేడ్చల్ జిల్లా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు మున్సిపాలిటీ పరిధి ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు.
గ్రామాలు కళకళలాడుతున్నాయి
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న పల్లెప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు కళకళలాడుతున్నాయి. డంపింగ్ యార్డుల నిర్మాణాల వల్ల గ్రామాలలో చెత్త ఎక్కడ కనపడకుండా పల్లెలు పరిశుభ్రంగా మారాయి. గత ప్రభుత్వాలు వైకుంఠధామాలను పట్టించుకున్న పాపనపోలేదు. తెలంగాణ ప్రభుత్వంలోనే వైకుంఠధామాల అభివృద్ధి జరిగింది.
పల్లెలకు కొత్తశోభ
పల్లెప్రగతి ద్వారా పల్లెలకు కొత్త శోభ వచ్చింది. గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది. పారిశుధ్యం మెరుగుపడింది. పచ్చదనం పెరిగింది. పల్లెలకు వచ్చిన కొత్తందాలతో పట్నంలో ఉండేవారంతా పల్లెలకు తిరిగి వస్తున్నారు. కరోనా పరిస్థితుల్లో పల్లెల్లో ఉండేందుకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు.