Rythu Bandhu | హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రైతు భరోసా కింద 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేశామన్న డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క మాటలకు, వ్యవసాయశాఖ వద్దనున్న గణాంకాలకు, క్షేత్రస్థాయిలో రైతులు చెప్తున్నదానికి ఏమాత్రం పొంతన కుదరడం లేదు. మంత్రి చెప్పింది నిజమైతే ఆరెకరాలున్న రైతులకు కూడా ఈపాటికి డబ్బులు జమ అయ్యేవి. ఐదెకరాలున్నా తమకు డబ్బులు పడలేదని రైతులు చెప్తున్నారు. వ్యవసాయశాఖ వద్ద ఉన్న అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు రైతుభరోసా సాయం అందింది 61 లక్షలమంది రైతులకు మాత్రమే.
గత వానకాలంలో ఐదెకరాలున్న రైతుల సంఖ్య 61 లక్షలు. అంటే ఈ లెక్కన వారికి కూడా రైతుభరోసా డబ్బులు పడి ఉండాలి. మంత్రి చెప్తున్నట్టు 65 లక్షలమంది రైతులకు చెల్లించి ఉంటే వారిలో ఆరెకరాల రైతులు కూడా వారిలో ఉండేవారు. వ్యవసాయశాఖ వద్దనున్న తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు దశలవారీగా 61.38 లక్షలమందికి మాత్రమే సాయం చెల్లించారు. మంత్రి చెప్తున్న గణాంకాలకు, వాస్తవ లెక్కలకు మధ్య భారీ తేడా ఉండడంతో విమర్శలు వినిపిస్తున్నాయి.