న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: సార్వత్రిక ఎన్నికల ముంగిట ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన అరెస్టు, రిమాండ్ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ కేసులో కేజ్రీవాల్ పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. ఈ కేసులో అప్రూవర్గా మారిన మాగుంట రాఘవ రెడ్డి మొత్తం ఎనిమిది స్టేట్మెంట్లు ఇచ్చాడని, మొదటి ఆరు స్టేట్మెంట్లలో కేజ్రీవాల్పై ఎలాంటి ఆరోపణలు చేయలేదని, చివరి రెండు స్టేట్మెంట్లలోనే ఆరోపణలు ఉన్నాయని, ఈ ఆరోపణలు చేసిన తర్వాత రాఘవ రెడ్డికి బెయిల్ మంజూరైందని సింఘ్వీ పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత రాఘవ రెడ్డి బీజేపీ మిత్రపక్షమైన టీడీపీలో చేరిన విషయాన్ని ప్రస్తావించారు. మద్యం పాలసీ కేసులో ఆప్ నేత విజయ్ నాయర్ను 2022 నవంబరులో అరెస్టు చేశారని, కేజ్రీవాల్ను మాత్రం 2024 మార్చిలో అరెస్టు చేశారని పేర్కొన్నారు.
విచారణ సందర్భంగా ఈడీ తరపున విచారణకు హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజుకు ధర్మాసనం పలు ప్రశ్నలు వేసింది. విచారణ ప్రారంభమైన సమయానికి, కేజ్రీవాల్ అరెస్టుకు మధ్య ఎందుకు ఎక్కువ సమయం పట్టిందని, మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం 365 రోజుల గడువు దాటొద్దు కదా అని ప్రశ్నించింది. జీవితం, స్వేచ్ఛ చాలా ముఖ్యమైనవని, వీటిని కాదనలేరని పేర్కొన్నది. సార్వత్రిక ఎన్నికల ముందరే ఎందుకు కేజ్రీవాల్ను అరెస్టు చేశారని అడిగింది. ఇప్పటివరకు ఈ కేసులో ఎటువంటి అటాచ్మెంట్ ప్రొసీడింగ్లు లేవని, ఒకవేళ ఉన్నట్లయితే పిటిషనర్(కేజ్రీవాల్) ప్రమేయం ఏంటో చూపించండని పేర్కొన్నది. మనీశ్ సిసోడియా కేసు విషయానికి వస్తే.. అనుకూలంగా, వ్యతిరేకంగా నిర్ధారణలు ఉన్నాయి. అలాంటప్పుడు కేజ్రీవాల్ కేసు ఎక్కడ ఉందో చెప్పగలరా? అని ప్రశ్నించింది. తమ ప్రశ్నలకు శుక్రవారం మధ్యాహ్నం తదుపరి విచారణలో జవాబులు ఇవ్వాలని ఆదేశించింది.
తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు కొట్టేసింది. ఈ దశలో బెయిల్ మంజూరు చేయలేమని సీబీఐ, ఈడీ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కావేరీ బవేజా పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సిసోడియా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్టు ఆప్ తెలిపింది. సిసోడియాను గత ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.