హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి ఫలితాల్లో బాలికలు సత్తాచాటారు. 93.23% ఉత్తీర్ణతతో పైచేయి సాధించారు. ఎప్పటిలాగే తమదే తిరుగులేని ఆధిపత్యమని నిరూపించుకొన్నారు. పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం మంగళవారం హైదరాబాద్లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విడుదల చేశారు.
ఈ ఏడాది మొత్తం రాష్ట్రంలో 91.31% ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 89.42% ఉత్తీర్ణత సాధించారు. దీనిని నిరుడితో పోల్చితే 5శాతం ఉత్తీర్ణత పెరిగింది. గత ఏడాది 86.60% విద్యార్థులు పాస్ కాగా, ఈ ఏడాది 91. 31% నమోదైంది. విద్యార్థుల ఉత్తీర్ణతను జిల్లాల వారీగా తీసుకొంటే నిర్మల్ జిల్లా మొదటిస్థానంలో నిలువగా, వికారాబాద్ జిల్లా చివరిస్థానానికి పరిమితమైంది.
కార్యక్రమంలో విద్యాశాఖ కమిషన్ శ్రీదేవసేన, సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ మల్లయ్య భట్టు, అదనపు డైరెక్టర్లు కే లింగయ్య, రమణకుమార్, శ్రీహరి, రాధారెడ్డి, విజయలక్ష్మీ, శ్రీనివాసచారి, ఎస్సెస్సీబోర్డు అధికారులు శ్రీనివాసరావు, విజయభారతి తదితరులు ఉన్నారు.
జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 : 30 గంటల వరకు ఈ పరీక్షలుంటాయి. విద్యార్థులు మే 16లోపు ప్రధానోపాధ్యాయులకు పరీక్ష ఫీజు చెల్లించాలి. పరీక్షలకు రెండు రోజుల ముందు వరకు రూ. 50 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింవచ్చు. మార్కుల రీకౌంటింగ్కు రూ. 500 ఫీజు, రీ వెరిఫికేషన్కు రూ.వెయ్యి ఫీజుగా చెల్లించి మే 15లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
బీసీ గురుకులాల ప్రభంజనం
మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయ సంస్థ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి రికార్డు సృష్టించారు. 98.25% ఉత్తీర్ణత పొంది రాష్ట్ర సగటు కంటే 6.94 ఎకువ ఉత్తీర్ణత శాతం నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 261 గురుకుల పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాయగా, 153 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా 391 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించి తమ ప్రతిభను చాటారు.
ఈ ఏడాది 17,845 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాయగా, వీరిలో 17,533 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 8,853 మంది బాలికలు, 8,680 మంది బాలురు ఉన్నారు. అత్యుత్తమ మారులు సాధించిన విద్యార్థులను, బోధనా సిబ్బందిని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు అభినందించారు.