హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగా ణ): ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుండటంతో ఇతర మెట్ట పంటలవైపు దృష్టి సారించాలని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా సాగునీటిశాఖ ఆరుతడి పంటలకే పెద్దపీట వేయాలని నిర్ణయించింది. యాసంగి పంట కాలంలో ఆయా ప్రాజెక్టుల కింద ఎంతమేరకు నీటిని విడుదలచేయాలనే అంశంపై ఇటీవలే రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (ఎస్సీఐఈఏఎం) సమాలోచనలు చేసింది.
ఏ ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించాలనే దానిపై అంచనాలను రూపొందించారు. ఈ క్రమంలో ఈ ఏడాది యాసంగిలో 34.27 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజినీర్ల సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవలనే సంబంధిత ప్రతిపాదనలను రూపొందించి ప్రభుత్వానికి సాగునీటిశాఖ నివేదించింది.