బెల్లంపల్లిరూరల్, జనవరి 21 : మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో గల అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు శనివారం కూల్చివేశారు. అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలాదేవి, తహసీల్దార్ కుమారస్వామి పర్యవేక్షణలో జేసీబీలతో పోలీసు బందోబస్తు మధ్య సిబ్బంది తొలగించారు. కన్నాల పరిధిలోని 139, 143, 119,120 సర్వే నంబర్లో ఉన్న భూమి పూర్తిగా ప్రభుత్వానికి చెందిందని ఆర్డీవో శ్యామలాదేవి తెలిపారు. కన్నాల క్రీడాప్రాంగణం సమీపంలో గల ప్రభుత్వ భూమిలో కొందరు కబ్జాదారులు నాటిన మామిడి మొక్కలను కూడా తొలగించినట్లు ఆమె తెలిపారు. డబుల్ బెడ్రూం పక్కన సర్వే నంబర్ 119,120 లో గల ప్రభుత్వ భూమిని ఓ నాయకుడు ఆక్రమించి ప్రహరీ నిర్మించాడని , మరికొంతమంది కూడా ఇండ్లు నిర్మించుకున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. కన్నాల రహదారి ఓవర్బ్రిడ్జి పక్కన నిర్మాణాలను కూడా అడ్డుకున్నారు. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ నకిలీ పత్రాలు సృష్టించి కోర్టుల నుంచి ఆర్డర్లు తెస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వాటిని పరిశీలించి భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు ఆపాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సీఐ కే బాబూరావ్, తాళ్లగురిజాల, టూటౌన్ ఎస్ఐలు జీ రాజశేఖర్ ,ఆంజనేయులు , ఆర్ఐలు ఆదిలక్ష్మి, పరమేశ్వరి, సర్వేయర్ సుధాకర్, వీఆర్ఏలు ,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.