ప్రజాస్వామిక పాలన అధికార, ప్రతిపక్షాల సయోధ్యతో నడుస్తుంది. వైరుధ్యాల ఘర్షణ, భిన్నత్వంలో ఏకత్వం అనే గతితర్క సూత్రం ఇక్కడ పనిచేస్తుంది. ఇద్దరి లక్ష్యం ఒకటే. ప్రజాక్షేమం, ప్రగతి రాజ్యం సాధించడం. ప్రజలు అధికారం ఇచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. ఆ ప్రభుత్వ నిర్ణయాలను విమర్శనాత్మక దృష్టితో చూస్తూ నిర్మాణాత్మక సూచనలు చేయడం ప్రతిపక్షం గురుతర బాధ్యత. ఇదంతా ప్రజాచర్చ కిందకు వస్తుంది. ఆ చర్చ సభ్యతాసంస్కారాలకు లోబడి ఉండాలి. అది హద్దుమీరి నిరాధారమైన విమర్శలకు, వ్యక్తిగత దూషణలకు, అర్థరహిత ప్రేలాపనలకు, నిస్పృహతో కూడిన తిట్లకు, శాపనార్థాలకు దారితీయొద్దు. కానీ ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది అదే. రెండుసార్లు రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితిని రెట్టించిన ఉత్సాహంతో గెలిపించారు. కాంగ్రెస్, బీజేపీ నామమాత్రపు అస్తిత్వానికే పరిమితమయ్యాయి. ఇది ప్రజలిచ్చిన స్పష్టమైన తీర్పు. ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆరే ప్రభుత్వ పగ్గాలు చేపట్టి తెలంగాణను నిన్నటి చీకట్ల నుండి వెలుగుల దారుల్లోకి నడిపించారు. ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో వినూత్నమైన చొరవలతో ముందుకు సాగుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వ విజయాలకు అంకెలు అద్దం పడుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు, గౌరవాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో విపక్ష నేతలు ప్రభుత్వ నిర్ణయాలను పరకాయించడం మానేసి, నోటిదురుసుకు పాల్పడుతున్నారు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే అనేక అవార్డులతో రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తుంటే కేంద్ర పాలకపక్షానికి చెందిన రాష్ట్ర నేతలు అసలు అభివృద్ధే జరగలేదనే తొండివాదనలతో మొండిగా పోతున్నారు. ఇక కాంగ్రెస్ ముఖ్యనేతల విపరీత ధోరణులు ఆ పార్టీ నేతలే అయిష్టపడేలా ఉంటున్నాయి. రాష్ట్ర విపక్షనేతలు నిర్మాణాత్మక సూచనల మాట మరిచిపోయారు. పథకాలు మొదలు నిర్మాణాల దాకా అన్నిట్లో కాళ్లల్లో కట్టెలు పెట్టే పనికి పూనుకుంటున్నారు. అభివృద్ధి మీదనో, సంక్షేమం మీదనో తమ సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. ప్రభుత్వం వాటిని పరిశీలనకు స్వీకరించవచ్చు. కానీ వారు ఆ పని చేయకుండా గుడ్డి వ్యతిరేకతతో నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. పెద్దాచిన్నా తేడాలేకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. చివరకు మహిళలను కించపర్చేందుకూ వెనుకాడటం లేదు.
విపక్షాలు ఏదైనా అంశంలో ఫలానా లోటుపాట్లున్నాయని అంటే వాటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవచ్చు. ఇది ప్రజాస్వామ్యంలో సాధారణ విషయం. అలాగాక ప్రభుత్వం మీద గుడ్డి వ్యతిరేకతతో, అధికారం దక్కలేదన్న అక్కసుతో బట్టకాల్చి మీద వేసే పనులకు విపక్ష ముఖ్యనేతలు తెగిస్తున్నారు. రాజకీయ చర్చ గౌరవమర్యాదల్ని మంట గలుపుతూ బూతులు, బూకరింపులకు దిగుతున్నారు. విమర్శ వికటిస్తున్నది. చర్చ దిగజారి రచ్చగా మారుతున్నది. సభ్యతకు సమాధి కడుతున్నారు. విపక్షాలు బాధ్యతగా మసలుకుంటాయని కోరుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యాశే అవుతుందేమో.