తిర్యాణి, ఫిబ్రవరి 16 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలకేంద్రంలోని చింతపల్లి పంచాయతీ పరిధిలోని గురుకుల పాఠశాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు రోడ్డెక్కారు. తిర్యాణి మండలకేంద్రం వరకు ర్యాలీగా వచ్చి కుమ్రంభీం చౌరస్తా వద్ద మంచినీటి డబ్బాలు, బకెట్లతో రాస్తారోకో చేపట్టారు.
బీఆర్ఎస్, బీజేపీ నాయకులతో పాటు గిరిజన సంఘాల నాయకులు మద్దతు పలికారు. నాలుగున్నర గంటల పాటు ఎండలో కూర్చొని నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కారమయ్యేవరకు ధర్నా వీడేది లేదని భీష్మించారు.
ఆర్సీవో అగస్తీన్, డీసీవో రమ్యకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో వేముల మల్లేశ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కృష్ణ చేరుకుని విద్యార్థులను సముదాయించారు. రెండు రోజుల్లోగా సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.