న్యూఢిల్లీ, మే 2: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యాంకర్ ఇన్వెస్టర్ల కోసం సోమవారం ప్రారంభించిన ఇష్యూకు మంచి డిమాండ్ నెలకొంది. రెండు రెట్లకుపైగా ఓవర్ సబ్స్ర్కైయిబ్ అయినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించిన అధికారిక గణాంకాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఏ కంపెనీ అయినా తమ పబ్లిక్ ఆఫర్ను మొదలుపెట్టేముందు యాంకర్ బుక్ను తెరిచి బిడ్స్ను ఆహ్వానిస్తుంది. ఎల్ఐసీ ఐపీవో ద్వారా 22.13 కోట్ల షేర్లు జారీ చేసి, రూ. 21,000 కోట్లు ఐపీవో సమీకరించాలన్నది లక్ష్యంకాగా, యాంకర్ ఇన్వెస్టర్ల కోసం 5.93 కోట్ల షేర్లను రిజర్వ్ చేసింది.
సంస్థ నిర్ణయించిన ఆఫర్ ధరల శ్రేణి రూ. 902-949కాగా, ఈ బ్యాండ్ గరిష్ఠధరపై యాంకర్ ఇష్యూ ద్వారా రూ.5,630 కోట్లు వస్తాయని అంచనా. అయితే యాంకర్ ఇన్వెస్టర్లకు ఏ ధరపై షేర్లన కేటాయించిందీ ఇంకా వెల్లడికాలేదు. సాధారణంగా ఇష్యూ ఓవర్ సబ్స్ర్కైయిబ్ అయితే గరిష్ఠ ధరపైనే షేర్ల కేటాయింపు జరుగుతుంది. యాంకర్ రౌండ్స్లో ఇష్యూ ట్రెండ్ను చూస్తుంటే మే 4న ప్రారంభంకానున్న భారీ ఐపీవో విజయవంతం అవుతుందని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎల్ఐసీ యాంకర్ ఇష్యూకు విదేశీ ఫండ్స్ నుంచి భారీ స్పందన లభించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆయా దేశాల ప్రభుత్వ ఫండ్స్ అయిన నార్వేకు చెందిన నోర్జెస్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, సింగపూర్కు చెందిన జీఐసీ పీటీఈ, అబుదాభి ఇన్వెస్ట్మెంట్ అథారిటీలు ఎల్ఐసీ యాంకర్ ఇష్యూలో పాలుపంచుకున్నారని బ్లూంబర్గ్ వార్తా సంస్థ తెలిపింది. దేశీయ మ్యూచువల్ ఫండ్స్ అయిన ఎస్బీఐ, ఆదిత్యాబిర్లా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్డీఎఫ్సీ, కొటక్లు ఒక్కోటి రూ. 150-1,000 కోట్ల చొప్పున పబ్లిక్ ఆఫర్లో ఇన్వెస్ట్ చేస్తామని ఎల్ఐసీకి హామీ ఇచ్చినట్టు సమాచారం. బుధవారం ప్రారంభంకానున్న ఐపీవోకు 70 లక్షల రిటైల్ దరఖాస్తులు వస్తాయని ఎల్ఐసీ అంచనా వేస్తున్నది.