ముంబై, జూలై: స్టాక్ మార్కెట్లు గత రెండు రోజులుగా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ వారం మొదటి రెండు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్లు పతనమైంది. 30 షేర్ సెన్సెక్స్ మంగళవారం 355 పాయింట్లు పతనమై 52,198.51 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
నిఫ్టీ 120.30 పాయింట్లు లేదా 0.76 శాతం క్షీణించి 15,632.10 పాయింట్ల ముగిసింది. సూచీలు దాదాపు ఒక శాతం మేర నష్టపోయాయని, దేశీయంగా, అంతర్జాతీయంగా అమ్మకాల ఒత్తిడి పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. డెల్టా వేరియంట్ వైరస్ నేపథ్యంలో కరోనా కేసులు పెరగడం ఆర్థిక రికవరీపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలతో మార్కెట్లు డౌన్ అవుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బక్రీద్ సందర్భంగా ఈరోజు మార్కెట్లకు సెలవు. అయితే సాయంత్రం కమోడిటీ కార్యకలాపాలు కొనసాగుతాయి.