న్యూఢిల్లీ : ఘరాన మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రూ .200 కోట్ల స్కామ్ కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేహికి ఢిల్లీ పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారని ఆమె టీం శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కేసులో నోరా ఫతేహిని గురువారం ఢిల్లీ పోలీసులకు చెందిన ఆర్ధిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఆరు గంటల పాటు ప్రశ్నించింది.
జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ సాగించిన కుట్రలో నోరాకు ప్రమేయం లేదని, క్రైమ్ సిండికేట్ విషయం ఆమెకు తెలియదని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారని నోరా టీం తెలిపింది. నోరాకు ఈ కేసుతో సంబంధం లేదని, నిందితుడి వ్యవహారాలపై అనుమానం రాగానే ఆమె ఈ విషయాలను తమతో పంచుకోగా నోరా చర్యలకు అనుగుణంగా దర్యాప్తు సాగించామని ఢిల్లీ పోలీసులు చెప్పినట్టు నటి టీం తెలిపింది.
దర్యాప్తు సాగుతోందని, అన్ని ప్రకటనలు, ఆధారాలను పరిశీలించిన తర్వాత కేసు దర్యాప్తునకు తుదిరూపు ఇస్తామని ఈవోడబ్ల్యూ ప్రతినిధి చెప్పారని నోరా టీం తెలిపింది. కాగా, ఇదే కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను పోలీసులు ఇటీవల ప్రశ్నించిన సంగతి తెలిసిందే.