న్యూఢిల్లీ: భారత్కు చెందిన పనేసియా కంపెనీ స్పుత్నిక్-వీ టీకాలు తయారు చేసేందుకు వీలుగా ఈ కంపెనీకి సర్కారు నుంచి రావాల్సిన 14 కోట్ల పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయమూర్తులు మన్మోహన్, నజ్మీ వజీరీతో కూడిన ధర్మాసనం సత్వరం పరిహారం విడుదలకు పనేసియా దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ కంపెనీ పనేసియాను స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ల తయారీకి ఎంపిక చేయడాన్ని ప్రస్తావిస్తూ, ఎక్కడో రష్యాలో ఉన్నవాళ్లకు హిమాచల్లో ఉన్న టీకాల కంపెనీ గురించి తెలుసు.. కానీ మనమే పట్టించుకోలేకపోయాం అని కోర్టు వ్యాఖ్యానించింది. ఏటా 10 కోట్ల టీకాల ఉత్పత్తికి పనేసియా రష్యా స్పుత్నిక్ వీ ఉత్పత్తిదారులతో ఒప్పందం కుదుర్చుకుంది. కోవిడ్ ఉత్పాతాన్ని ఎదుర్కొనేందుకు టీకాలే శరణ్యమని కేంద్ర ప్రభుత్వం కూడా అంటున్నది. కానీ మనదేశంలో ఆ టీకాలకే కొరత ఉంది. హిమాచల్ లోని బద్దీలో పనేసియాకు టీకాల ఉత్పత్తి యూనిట్ ఉంది. గతంలో ఇన్ఫ్లూయెంజా టీకాల సరఫరా వ్యవహారంలో మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ పనేసియాకు రూ.14 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది. ఈ నిధులు విడుదల చేస్తే కంపెనీ టీకాల కార్యక్రమానికి సహాయకారిగా ఉంటుందని పేర్కొన్నది. 2010కి సంబంధించిన ఒక కేసులో పనేసియాకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు పరిహారం చెల్లించాలని 2019లో ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ పరిహారాన్ని వడ్డీతో సహా చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పుడు పెద్ద ఎత్తున కరోనా టీకాల ఉత్పత్తికి పనేసియా రష్యా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. నేరుగా దిగుమతి చేసుకునే టీకాలకు బ్రిడ్జ్ టెస్టులు లేనప్పుడు పనేసియా కంపెనీ టీకాలకు కూడా బ్రిడ్జి టెస్టులు కావాలని అడగకుంటే ఉంటే బాగుంటుందని కోర్టు అభిప్రాయపడింది. అత్యవసర వినియోగం కింద పనేసియాకు అనుమతి ఇవ్వాలని సూచించింది. అయితే పనేసియా తన టీకాల ఉత్పత్తికి స్థానిక అధికారుల అనుమతి పొందాలని, అలాగే ఆదాయంలో 20 శాతం హైకోర్టు రిజిస్ట్రీలో జమ చేయాలని సూచించింది.