న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ (Congress) పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ (Arvinder Singh Lovely) తన పదవికి రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకుగాను తాను పార్టీ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఆప్తో పొత్తును ఢిల్లీ యూనిట్ అంగీకరించలేదని వెల్లడించారు. ఈ మేరకు ఐఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై నిరాధార అవినీతి ఆరోపణలతోనే ఆ పార్టీ ఏర్పాటయిందని చెప్పారు. అలాంటి పార్టీతో పొత్తు వద్ద ఢిల్లీ శాఖ ఏకగ్రీవంగా తీర్మాణం చేసిందన్నారు. అయినప్పటికీ అధిష్ఠానం నిర్ణయం మేరకు తాము సమర్ధించినట్లు తెలిపారు.
కాగా, పీసీసీ అధ్యక్ష హోదాలో పార్టీ పదవుల నియామకాలకు ఢిల్లీ ఇన్చార్జీ, పార్టీ ప్రధాన కార్యదర్శి దీపక్ బబరియా తనను అనుమతించడం లేదని ఆరోపించారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, తమపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. పొత్తులో భాగంగా పార్టీకి మూడు సీట్లే కేటాయించడాన్ని తప్పుబట్టారు. పార్టీ ప్రయోజనాల కోసం అంగీకరించామని, అయితే ఢిల్లీ కాంగ్రెస్తో సంబంధం లేనివారిని అభ్యర్థులుగా ప్రకటించారని చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకుల ప్రయోజనాలను రక్షించలేని తాను పదవిలో కొనసాగడం మంచిదికాదని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్న సమయంలో డీపీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకోవడం పార్టీకి సమస్యగా మారింది.