న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. నిత్యం సీబీఐ, ఈడీలపై ఒత్తిడి పెంచే బదులు దేశ అభివృద్ధి దిశగా కేంద్రం కొన్ని సానుకూల చర్యలు చేపట్టడం మేలని హితవు పలికారు.
మద్యం పాలసీపై బీజేపీ స్టింగ్ ఆపరేషన్ గురించి ప్రస్తావించగా అసలు మద్యం కుంభకోణం ఏంటో తనకు అర్ధం కావడం లేదని కేజ్రీవాల్ బదులిచ్చారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంపై జరిపిన దాడుల్లో సీబీఐకి ఏమీ పట్టుబడలేదని గుర్తుచేశారు. స్టింగ్ ఆపరేషన్లను అన్నింటినీ సీబీఐకి సమర్పించాలని సిసోడియా విశ్వాసంతో చెప్పారని అన్నారు.
ఆయన ఎలాంటి తప్పు చేసినట్టు తేలితే సోమవారం లోగా అరెస్ట్ చేయాలని లేకుంటే క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. ఈడీ, సీబీఐ పేరుతో ప్రతి ఒక్కరినీ కేంద్ర ప్రభుత్వం భయపెడుతున్నదని వ్యాఖ్యానించారు. ఎవరైనా తప్పు చేస్తే అతడిని అరెస్ట్ చేయలని వ్యక్తులపై సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తూ పోతే దేశ పురోగతి సాధ్యపడదని చెప్పారు.