న్యూఢిల్లీ, నవంబర్ 24: ‘ఢిల్లీ ప్రజలు వాయు కాలుష్యంతో ఎందుకు బాధపడాల’ని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పరిస్థితి చెయ్యి దాటిపోయేదాకా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇది (ఢిల్లీ) దేశ రాజధాని. మనం ప్రపంచానికి ఏం సంకేతం ఇస్తున్నామ’ని నిలదీసింది. కాలుష్యానికి కారణాలను గుర్తించి ముందుగానే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ఢిల్లీ వాయు కాలుష్యం అంశంపై బుధవారం విచారణ జరిపింది. కేంద్రం, దేశ రాజధాని ప్రాంత (ఎన్సీఆర్) రాష్ర్టాలు కాలుష్య నియంత్రణకు ప్రస్తుత చర్యలను కొనసాగించాలని ఆదేశించింది. ముందస్తు చర్యలు చేపట్టేందుకు భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) సహాయం తీసుకోవాలని సూచించింది. దేవుడి దయ వల్లో ఆంక్షల వల్లో ఢిల్లీలో కాలుష్యం తగ్గినప్పటికీ విచారణను ఆపబోమని, కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
ఢిల్లీ సరిహద్దు రాష్ర్టాల్లో రైతులు పొలాల్లో పంట వ్యర్థాలను తగులబెడుతున్న అంశం, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై న్యాయవాదులతో చర్చించిన ధర్మాసనం… అధికారుల ఉదాసీనతపై మండిపడింది. ‘ఇన్నేండ్లూ అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్లు వెళ్లి రైతులను కలుసుకోలేరా?’ అని ప్రశ్నించింది. ‘పాతరోజుల్లో అంటే కంప్యూటర్లు లేవు. ఇప్పుడు సూపర్ కంప్యూటర్లు కూడా ఉన్నాయి. గత ఐదేండ్ల డాటా ఆధారంగా రాబోయే 15 ఏండ్లలో కాలుష్యం స్థాయి ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు’ అని పేర్కొంది. ఐఎండీ వద్ద అత్యాధునిక సాధనాలు ఉన్నాయని, వాటిని ఉపయోగించుకోవాలని సూచించింది. కాగా, భవన నిర్మాణ కార్మికుల అంశంపై ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రాష్ర్టాల వద్ద రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి లేబర్ సెస్ కింద వసూలు చేసిన నిధులు భారీగా ఉన్నాయని, వాటి నుంచి కార్మికులకు చెల్లించాలని తెలిపింది.
న్యూఢిల్లీ: చిన్నపాటి నేరాల్లో చట్టసభల సభ్యులపై నమోదైన కేసుల విచారణకు ప్రత్యేక మేజిస్టీరియల్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆదేశిస్తామని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ప్రత్యేక ధర్మాసనం తెలిపింది. దీంతో చిన్నపాటి నేరాలకు ప్రత్యేక సెషన్స్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న చట్టసభల సభ్యుల ‘సమస్య’ పరిష్కారమవుతుందన్నది. ప్రత్యేక సెషన్స్ కోర్టులో ఎక్కడి వరకు విచారణ జరిగితే అక్కడ నుంచి మేజిస్టీరియల్ కోర్టులో ఈ విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.