హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు పట్టణాలు, నగరాలకే పరిమితమైన డిగ్రీ కాలేజీలు ఇప్పుడు పల్లెబాట పడుతున్నాయి. గ్రామీణప్రాంతాలు, మండల కేంద్రాల్లో భారీగా పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని 50 శాతానికి పైగా మండలాల్లో డిగ్రీ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలున్నాయి. 2006 నుంచి తెలంగాణలో ఏటేటా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటవుతున్న కాలేజీల సంఖ్య పెరుగుతున్నది. దీంతో ఉన్నత విద్య అందరికీ అందుబాటులోకి వస్తున్నది. ఈ విషయాన్ని నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఇటీవలే వెల్లడించింది.
జాతీయ సగటు కన్నా మెరుగు..
ఏటా ఇంటర్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతుండటంతో డిగ్రీ కాలేజీలు కూడా పెరుగుతున్నాయి. విద్యార్థుల డిమాండ్కు అనుగుణంగా మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ డిగ్రీ కాలేజీలు ఏర్పాటయ్యాయి. జాతీయస్థాయిలో లక్ష జనాభాకు 28 కాలేజీలుంటే, తెలంగాణలో లక్ష జనాభాకు 51 కాలేజీలున్నాయి. ఒక్కో కాలేజీలో సరాసరిగా మన దగ్గర 558 విద్యార్థులు ప్రవేశాలు పొందుతుండగా, జాతీయస్థాయిలో 698 మంది చేరుతున్నారు. అంతేకాకుండా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్)లోను తెలంగాణ ఉత్తమంగా నిలిచింది. జాతీయస్థాయిలో జీఈఆర్ 27.1 శాతం ఉంటే, తెలంగాణలో 35.6 శాతం ఉన్నది. పురుషుల్లో 37.1, మహిళలల్లో 34.2, ఎస్సీ పురుషుల్లో 30.6, మహిళలల్లో 32.4, ఎస్టీ పురుషుల్లో 32.3, మహిళల్లో 26.6శాతం జీఈఆర్ నమోదవుతున్నది. పై అన్నింటిలోను జాతీయ సగటుతో పొల్చితే, తెలంగాణ ఉత్తమంగా ఉండటం గమనార్హం.