ఐపీఎల్లో మరో మ్యాచ్ అభిమానులకు పసందైన విందు అందించింది. ఆట అంటే ఇది అన్నట్టుగా ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో సన్రైజర్స్ హైదరాబాద్పై గుజరాత్ టైటాన్స్దే పైచేయి అయ్యింది. ఆఖరి ఓవర్లో విజయానికి 22 పరుగులు అవసరమైన దశలో టైటాన్స్ హార్డ్హిట్టర్ రషీద్ఖాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. జాన్సెన్ను ఉతికి ఆరేస్తూ మూడు భారీ సిక్స్లతో టైటాన్స్కు అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు.
కశ్మీర్ స్పీడ్గన్ ఉమ్రాన్ మాలిక్ నిప్పులు చెరిగే బంతులతో గుజరాత్ బ్యాటర్ల వెన్నులో వణుకుపుట్టించాడు. ఐదు వికెట్లతో లీగ్లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకోగా, తొలుత అభిషేక్శర్మ, అడెన్ మక్రామ్ అర్ధసెంచరీలతో రైజర్స్ పోరాడే స్కోరు అందుకుంది. తమ జోరు కొనసాగిస్తూ కచ్చితంగా గెలుస్తుందనకున్న మ్యాచ్ను హైదరాబాద్ చేజేతులా వదులుకొని నిరాశపరిచింది.
ముంబై: వావ్ వాట్ ఏ మ్యాచ్! లీగ్లో రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. బుధవారం వాంఖడే మైదా నం వేదికగా జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపాలైంది. గత మ్యాచ్లో ఎదురైన ఓటమికి టైటాన్స్ ప్రతీకారం తీర్చుకుంది. వరుసగా ఐదు మ్యాచ్ల్లో విజయాలతో మంచి జోరు మీద కనిపించిన రైజర్స్ ఓటమి చవిచూసింది.
అభిషేక్ శర్మ(42 బంతుల్లో 65, 6ఫోర్లు, 3 సిక్స్లు), మక్రామ్(40 బంతుల్లో 56, 2ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధసెంచరీలతో హైదరాబాద్ తొలుత 20 ఓవర్లలో 195/6 స్కోరు చేసింది. కెప్టెన్ విలియమ్సన్(5), రాహుల్ త్రిపాఠి(16)నిరాశపరిచినా..వీరిద్దరు ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఆఖర్లో శశాంక్సింగ్(25 నాటౌట్) వీరవిహారంతో భారీ స్కోరు నమోదు చేసుకుంది. షమీ(3/39) మూడు వికెట్లు తీశాడు. 196 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. సాహా(38 బంతుల్లో 68, 11 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, రాహుల్ తెవాటియా(21 బంతుల్లో 40 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్స్లు), రషీద్ఖాన్(11 బంతుల్లో 31 నాటౌట్, 4 సిక్స్లు) సుడిగాలి ఇన్నింగ్స్తో చెలరేగారు.
జాన్సెన్ ఆఖరి ఓవర్లో నాలుగు భారీ సిక్స్లతో విరుచుకపడ్డ వీరిద్దరు రైజర్స్ ఆశలపై నీళ్లు చల్లుతూ టైటాన్స్కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టారు. కశ్మీర్ స్పీడ్గన్ ఉమ్రాన్(5/25) అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినా లాభం లేకపోయింది. ఇరు జట్లు తమ ఆఖరి ఓవర్లలో నాలుగు సిక్స్లతో 25 పరుగులు సాధించడం విశేషం.ఉమ్రాన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
అభిషేక్, మక్రామ్ అదుర్స్:
గుజరాత్కు టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్కు మెరుగైన శుభారంభం దక్కలేదు. లీగ్లో మంచి ఫామ్మీదున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్(5) నిరాశపరిచాడు. షమీ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఇన్స్వింగర్ను సరిగ్గా అర్థం చేసుకోని విలియమ్సన్ క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన రాహుల్ త్రిపాఠి(16) కూడా విలియమ్సన్ను అనుసరించాడు.
పరుగుల ఖాతా తెరువకముందే యశ్ దయాల్ బౌలింగ్లో రషీద్ఖాన్ క్యాచ్ జారవిడువడంతో త్రిపాఠి బయటపడ్డాడు. ఆ అవకాశాన్ని అనుకూలంగా మలుచుకుంటూ 6, 4, 4తో జోరుమీద కనిపించిన త్రిపాఠిని షమీ పెవిలియన్ పంపాడు. దీంతో 44 పరుగులకే రైజర్స్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో యువ ఓపెనర్ అభిషేక్శర్మ(65), మక్రామ్(56) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. గుజరాత్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డుకు కీలక పరుగులు జోడించారు.
ముఖ్యంగా అభిషేక్ చూడచక్కని షాట్లతో అలరించడంతో పవర్ప్లే ముగిసే సరికి హైదరాబాద్ రెండు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. ఈ క్రమంలో అభిషేక్, మక్రామ్ ఇన్నింగ్స్ను ముందుండి నడిపించారు. రషీద్ఖాన్ బౌలింగ్లో భారీ సిక్స్తో అభిషేక్ అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ జోడీని విడదీసేందుకు గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా లాభం లేకపోయింది.
ఇద్దరు బ్యాటర్లు కుదురుకుని ఇన్నింగ్స్ జోరందుకుంటున్న తరుణంలో జోసెఫ్ బౌలింగ్లో అభిషేక్ బౌల్డ్ కావడంతో మూడో వికెట్కు 96 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత పూరన్(3), సుందర్(3) వెంటవెంటనే నిష్క్రమించారు. దీంతో స్కోరుబోర్డుకు ఒక రకంగా మందగించింది. జాన్సెన్(8)ను అండగా చేసుకుంటూ శశాంక్సింగ్(6 బంతుల్లో 25 నాటౌట్, ఫోర్, 3 సిక్స్లు) దుమ్ముదులిపాడు. ఫెర్గుసన్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో శశాంక్ హ్యాట్రిక్ సిక్స్లతో హైదరాబాద్కు భారీ స్కోరు కట్టబెట్టాడు.
గుజరాత్తో మ్యాచ్లో రైజర్స్ స్పీడ్స్టర్ ఉమ్రాన్ మాలిక్ ఉగ్రరూపమే ప్రదర్శించాడు. గంటకు 140కి.మీ వేగంతో నిప్పులు చెరిగే బంతులతో గుజరాత్ బ్యాటర్లను గడగడలాడించాడు. తుపాకి వదిలిన బుల్లెట్లా యమస్పీడ్కు స్వింగ్ను జోడిస్తూ వరుస విరామాల్లో వికెట్లు నేలకూల్చాడు.
ఓపెనర్ శుభ్మన్ గిల్(22) వికెట్తో మొదలైన ఈ కశ్మీర్ యువ సంచలనం వికెట్ల వేట ఆఖరి వరకు దిగ్విజయంగా కొనసాగింది. గిల్ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా(10), సాహా(68), మిల్లర్(17), మనోహర్(0) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తీసిన ఐదు వికెట్లలో నాలుగు వికెట్లు క్లీన్బౌల్డ్ కావడం మ్యాచ్కే హైలెట్గా నిలిచింది. ఓవైపు ఉమ్రాన్ ఐదు వికెట్లతో లీగ్లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినా..రైజర్స్ ఓటమివైపు నిలువడం అభిమానులను నిరాశపరిచింది.
హైదరాబాద్: 20 ఓవర్లలో 195/6 (అభిషేక్ 65, మక్రామ్ 56, షమీ 3/39, దయాల్ 1/24), గుజరాత్: 20 ఓవర్లలో 199/5 (సాహా 68, తెవాటియా 40 నాటౌట్, రషీద్ఖాన్ 31 నాటౌట్, ఉమ్రాన్ 5/25)