సెకండ్వేవ్ లాక్డౌన్ సమయంలో తాను తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యానని, భవిష్యత్తు పట్ల అనిశ్చితి, అభద్రతాభావంతో నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పింది అగ్రకథానాయిక దీపికాపడుకోన్. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లాక్డౌన్ రోజులనాటి తన అనుభవాల్ని పంచుకుంది. ఆమె మాట్లాడుతూ ‘అప్పటి వరకు ఎంతో సంతోషంగా సాగిన జీవితం ఒక్కసారిగా శూన్యంగా అనిపించింది. కుటుంబంలోని చాలా మంది ఒకే సమయంలో కరోనా బారిన పడటంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఏదో తెలియని భయం వెంటాడింది. నాటి రోజులు నా మానసిక దృక్పథాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆ సంక్షోభ పరిస్థితుల నుంచి బయట పడటానికి రెండు నెలల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నా. సెకండ్వేవ్ లాక్డౌన్ నాకు ఎన్నో పాఠాల్ని నేర్పించింది. ఓ రకంగా నా జీవితాన్నే మార్చివేసింది’ అని చెప్పింది. భర్త రణ్వీర్సింగ్తో దీపికాపడుకోన్ నటించిన ‘83’ చిత్రం ఇటీవలే విడుదలైన సంగతి తెలిసింది. 1983 సంవత్సరంలో భారతజట్టు తొలిసారి ప్రపంచకప్ను గెలుచుకొని విశ్వవిజేతగా నిలిచిన సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో నటించడమే కాకుండా నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించింది దీపికాపడుకోన్.