రెంజల్: రెంజల్ మండలం కందకుర్తి వద్ద ఆదివారం గోదావరి నదిలో వరద నీరు స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గత వారంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు వరద ఉరకలేసింది. త్రివేణి సంగమ క్షేత్రం నది పరివాహక ప్రాంతాల పరిధిలో ఉన్నగ్రామాల ప్రజలను అతలాకుతలం చేసింది. వరద ఉధృతి కారణంగా చేతికి అందిన పంటలు నీటి పాలు కావటం రైతులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
నాలుగు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి శాంతించింది. దీంతో నదిలో గల పురాతన శివాలయ శిఖరం దర్శనమిస్తుంది. వరద నీటి ప్రవాహనికి కొట్టుకు వచ్చిన బంక మట్టి పుష్కర ఘాట్లపై చేరింది. పర్వదినాల్లో నదిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. మొక్కులు తీర్చుకునే భక్తులకు పుష్కర ఘాట్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.