ఇబ్రహీంపట్నం, నవంబర్ 26 : రంగారెడ్డి జిల్లా కూరగాయల పంటల సాగుకు పెట్టింది పేరు. నగరానికి వచ్చే కూరగాయల్లో అత్యధికంగా జిల్లా నుంచే వచ్చేవి. నగరంలోని మాదన్నపేట్, కొత్తపేట్, ఎల్బీనగర్, వనస్థలిపురం, తుర్కయాంజాల్, ఇబ్రహీంపట్నం, శంషాబాద్ తదితర ప్రాంతాలకు తరలించి విక్రయించేవారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రంగారెడ్డి జిల్లాలో కూరగాయల సాగు మరింత పెరిగేలా ప్రభుత్వం క్రాప్ కాలనీలనూ ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నది. ఇటీవల జిల్లాలో వర్షాలు బాగా కురియడంతో చెరువులు, కుంటలు నిండడంతో పాటు భూగర్భజలాలు పెరిగి బోరు బావులు మళ్లీ వాడుకలోకి వచ్చాయి. కూరగాయల సాగు తగ్గడంతో దిగుబడులు తగ్గి ధరలు విపరీతంగా పెరిగాయి. గతంలో జిల్లాలో వరి సాగు విస్తీర్ణం తగ్గించి ఆరుతడి పంటలపై రైతులు ఎక్కువగా దృష్టి పెట్టేవారు. కొద్దిపాటి నీటితో డ్రిప్పు, స్ప్రింక్లర్లు వంటి సాయంతో కూరగాయల సాగు చేసేవారు. కానీ, వర్షాభావం అనుకూలించడంతో కూరగాయలకు బదులు వరి పంటను సాగు చేస్తున్నారు. దీంతో కూరగాయల సాగు తగ్గి ధరలు అమాంతం పెరిగాయి. గతంలో ఏ కూరగాయలు కొనాలన్నా కిలోకు రూ.10 నుంచి రూ.30 వరకు ఉండేది. ప్రస్తుతం ఏ కూరగాయలు కొనాలన్నా కిలో రూ.50పైమాటే. ముఖ్యంగా టమాట కిలో రూ.వంద మార్కును దాటింది. కూరగాయలు కొనాలంటేనే సామాన్య, మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి.
పట్టణాల నుంచి గ్రామాలకు కూరగాయలు..
గతంలో గ్రామాల్లో కూరగాయలు పండించి పట్టణ ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. ఈ సంవత్సరం పరిస్థితి భిన్నంగా మారింది. పట్టణ ప్రాంతాల నుంచి గ్రామాలకు కూరగాయలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. గతంలో ఇబ్రహీంపట్నం కూరగాయల మార్కెట్కు చుట్టుపక్కల గ్రామాల రైతులు కూరగాయలను తీసుకొచ్చేవారు. మారిన పరిస్థితుల దృష్ట్యా వ్యాపారులు నగరం నుంచి కూరగాయలు తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం మార్కెట్లో విక్రయిస్తున్నారు. గతంలో ఏ గ్రామంలో చూసినా రైతులు టమాట, వంకాయ, బెండకాయ, బీరకాయ, కాకరకాయ, సొరకాయ పంటలు సాగు చేసుకునేవారు. ప్రస్తుతం వరి పంటను సాగు చేయడం వల్ల కూరగాయల సాగు తగ్గింది.
మార్కెట్కు వెళ్లాలంటేనే భయంగా ఉంది..
కూరగాయల మార్కెట్కు వెళ్లాలంటేనే భయంగా ఉంది. గతంలో వంద రూపాయల కూరగాయలు కొంటే నాలుగైదు రోజులు వచ్చేవి. ప్రస్తుతం 100 రూపాయలు పట్టుకుని మార్కెట్కు వెళితే ఒక్కపూటకు సరిపడా కూరగాయలు రావడం కష్టంగా మారింది.