సృష్టి ఆదిలో శ్రీమహావిష్ణువు ధరించిన అద్భుత రూపమే వటపత్రశాయి అలంకారం. అలాంటి అపురూప అలంకారంలో యాదాద్రి లక్ష్మీనరసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. పాంచరాత్రగమశాస్త్రం ప్రకారం అత్యంత వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం ఉదయం స్వామివారు వటపత్రశాయి అలంకార సేవలో, రాత్రి హంస వాహనంపై బాలాలయంలో ఊరేగారు. గవర్నర్ తమిళిసై యాదాద్రీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం శ్రీకృష్ణాలంకర సేవలో స్వామివారు దర్శనమివ్వనున్నారు.
యాదాద్రి, మార్చి 7 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా పాంచరాత్రగమశాస్త్రం రీతిలో జరుగుతున్నాయి. స్వామివారి అలంకార సేవోత్సవంలో భాగంగా నాలుగో రోజు సోమవారం ఉదయం నృసింహస్వామివారు వటపత్రశాయి అలంకార సేవలో, రాత్రి హంస వాహనంలో బాలాలయంలో ఊరేగారు. మొదటగా బాలాలయంలో వేకువజామున ద్వారతోరణం, ధ్వజకుంభారాధన, అగ్ని ఆరాధన, మూల మంత్ర, పంచసూక్త హవనం వంటి పూజలను ఆలయ ప్రధానార్చకులు, యాజ్ఞీకులు, రుత్వికులు, పారాయణదారులు, అర్చకులు అత్యంత వైభవంగా చేశారు. నిత్యపూర్ణాహుతి చేపట్టారు. ఉదయం 11 గంటలకు స్వామివారిని వటపత్రశాయి అలంకారంలో ప్రత్యేక పల్లకిపై అధిష్ఠించారు. రుత్వికులు, వేదపండితులు స్వామివారి అలంకార సేవ ముందు దివ్య ప్రబంధ వేద పారాయణాలు, మూల మంత్రజపాలు పఠించారు. అనంతరం డోలు, సన్నాయి, మేళాలతో స్వామివారి మంగళకరమైన వాయిద్యాలతో స్వామివారిని బాలాలయంలో ఊరేగించారు. భక్తులు స్వామివారి అలంకార సేవ చూసి తరించారు. అనంతరం ప్రధానార్చకులు వటపత్రశాయి విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ నారాయణరెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ ఈఓ ఎన్.గీత, ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు పాల్గొన్నారు.
సృష్టి ఆదిలో మహావిష్ణువు ధరించిన అద్భుత రూపమే వటపత్రశాయి అలంకారం. జగమంతా జలమయమై, అంధకారమై ఉన్న సమయంలో భగవానుడు మర్రి ఆకుపై పవళించి తన గర్భంలోని లోకాలన్నింటికీ తన పాదారవిందం చేత నోటి ద్వారా అమృతాన్ని అందిస్తూ కాపాడిన శ్రీమన్నారాయణ తత్వం ఈ అలంకార సేవలో దర్శించవచ్చునని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. సర్వలోక రక్షకుడిని తానేనని స్వామివారు ఈ అలంకార సేవలో భక్తులకు దర్శన భాగ్యం కలిగించాడని అన్నారు. ఈ లీలలో సమస్త చరాచర సృష్టి మండలాన్ని నిర్మించే తీరు దర్శించవచ్చునని అర్చకులు వివరించారు.
దేవదేవుడు తన మనోనేత్రంలో లోకంలోని మంచి, చెడులను వేరు చేసే విధానానికి ప్రతీకగా.. పాలు, నీటిని వేరు చేయగల హంస దివ్య వాహనంగా స్వామివారు భక్తజనులకు గురువారం రాత్రి దర్శనమిచ్చారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి తిరు కల్యాణ బ్రహ్మోత్సవంలో భాగంగా నాలుగో రోజు రాత్రి నిత్య కైంకర్యాల అనంతరం నారసింహుడిని దివ్యమైన అలంకారంతో హంస వాహనంపై అధిష్టింపజేసి బాలాలయ మండపంలో ఊరేగించారు. హంస వేద స్వరూపం, జ్ఞానాత్మకమైన వేద ప్రాముఖ్యంగా ఉన్న హంస వాహన సేవను ఆగమశాస్త్రరీతిలో ఆలయ ప్రధానార్చకులు నిర్వహించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి ఓ భక్తుడు సాలగ్రామ హారాన్ని బహూకరించాడు. కాకతీయ సిమెంటు, షుగర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత పల్లెంపాటి వీరయ్య 32 సాల గ్రామాలతో కూడిన బంగారు హారాన్ని సోమవారం ఆలయ ఈఓ ఎన్.గీత, ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులుకు అందజేశారు. మొదటగా హారాన్ని వటపత్రశాయి అలంకారంలో ఉన్న యాదాద్రీశుడికి అలంకరించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొండ కింద తులసి కాటేజీ నృసింహ సదనంలో భువనగిరికి చెందిన వాసవీ డెంటల్ దవాఖాన ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు.
పురాణ ఇతిహాసంలో, వేద శాస్త్రంలో హంసను జ్ఞానానికి ప్రతీకగా పేర్కొన్నారు. హంస శాంతికి, కీర్తికి, ఆనందానికి, అందానికి ప్రతీక. పక్షి జాతికి చెందినా భగవదనుగ్రహం వల్ల రాజహంసగా, పరమాత్మ వాహనంగా ఆగమశాస్ర్తానుసారంగా నిర్వహించడానికి యోగ్యత కలిగి ఉన్నదని అర్చకులు తెలిపారు. సాధారణంగా కైవల్యం జ్ఞానం వల్లనే లభింస్తుందని, ఆ జ్ఞానం శుద్ధసత్వగుణ ప్రవృత్తిని కలిగిన నాడు జీవుడు పొందగలడని ఈ హంస వాహనంపై అధిరోహించి పరమాత్మ ప్రత్యక్షంగా భక్తకోటికి అనుగ్రహించుట ఎంతో ముక్తి ప్రదమైనదని వివరించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వటపత్రశాయి అలంకార సేవలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ పాల్గొని తరించారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన గవర్నర్.. స్వామివారి అలంకార సేవలో పాల్గొన్నారు. అలంకార సేవ ఊరేగింపులో పల్లకీని మోశారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారు శ్రీకృష్ణ అలంకార సేవలో (మురళీకృష్ణుడు) భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం పొన్నవాహన సేవలో ఊరేగనున్నారు.