మనీలా: ఫిలిప్పైన్స్ ఎయిర్ ఫోర్స్ విమానం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. సోమవారం ఘటనా ప్రాంతంలో మరికొన్ని మృతదేహాలు లభ్యం కావడంతో మొత్తం మృతుల సంఖ్య 50కి చేరింది. మృతుల్లో 47 మంది సైనికులు, ముగ్గురు విమాన సిబ్బంది ఉన్నారు. ఫిలిప్పైన్స్కు చెందిన సీ-130 మిలిటరీ విమానం.. మిండనావోలోని కగయాన్ డి ఓరో నుంచి సులూ ప్రావిన్స్కు బలగాలను తరలిస్తూ ప్రమాదానికి గురైంది.
ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 84 మంది సైనికులు, 8 మంది సిబ్బందితో కలిపి మొత్తం 92 మంది ఉన్నారు. జోలో ఐలాండ్లో రన్వే కనిపించక విమానం సమీపంలోని పాటికుల్ గ్రామంలో కూలిపోయింది. విమానం కూలిన కొద్ది నిమిషాల్లోనే భద్రతాబలగాలు, స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
విమానం నేలను తాకడానికి కొన్ని సెకన్ల ముందు కొందరు సైనికులు కిందకు దూకినట్లు స్థానికులు తెలిపారు. విమానం నేలను ఢీకొట్టిన కొన్ని నిమిషాలకే భారీ పేలుడు సంభవించిందన్నారు.