Dasoju Sravan | గురుకులాల కిరాణ కొనుగోళ్లలో అవినీతి జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ల వ్యవస్థను పక్కనబెట్టడం తీవ్ర అవమానకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఐఏఎస్ అధికారులపై ప్రభుత్వానికి నమ్మకం లేదా అని ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు.
రూ.100 కోట్ల కమీషన్ల కోమే మూడు నెలల టెండర్ల విధానానికి మంగళం పాడారని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఏడాది కాలపరిమితి టెండర్లతో ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లు గండి కొట్టే ప్లాన్ చేశారని మండిపడ్డారు. తెలంగాణ బ్రాండ్ తాండూర్ కందిపప్పునకు మంగళం పాడి.. ఆఫ్రికా నాసిరకం పప్పులతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.165 కోట్ల టర్నోవర్ నిబంధనతో స్థానిక చిన్న వ్యాపారులు, మహిళా సంఘాల గొంతు నొక్కడమే అని వ్యాఖ్యానించారు. కేంద్రీకరణ మేలైతే ప్రైవేటు కాంట్రాక్టర్లు ఎందుకు అని ప్రశ్నించారు. మార్క్ఫెడ్ ద్వారా నేరుగానే కొనుగోలు చేయవచ్చు కదా అని నిలదీశారు. అధికారులకు రాబోయే కేసీఆర్ ప్రభుత్వంలో న్యాయ విచారణ తప్పదని హెచ్చరించారు.