అమరావతి : ఏపీలో జనసేనకు చెందిన ఎమ్మెల్యే పనితీరుపై ఆ పార్టీ అధినేత, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) అసహనం వ్యక్తం చేశారు. గడిచిన రెండేళ్లలో వారిపై వచ్చిన ఆరోపణల గురించి ప్రశ్నల వర్షం కురిపించారు.
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar ) తనపై అత్యాచారానికి పాల్పడ్డారని అదే నియోజకవర్గానికి చెందిన మహిళ వీడియోలో సంచలన ఆరోపణలు చేసింది. శ్రీధర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని కొన్ని ప్రైవేట్ వీడియోలను కూడా విడుదల చేసింది. దీంతో స్పందించిన ఆ పార్టీ అధిష్టానం నిజనిర్ధారణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారించి ఇటీవల నివేదికను పార్టీకి అందజేసింది.
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైతం ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సంజాయిషీని కోరింది. ఈ సందర్భంగా శనివారం పవన్కల్యాణ్ ఇద్దరు ఎమ్మెల్యేలతో భేటీ అయి వ్యక్తిగతంగా వారి అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం ప్రభుత్వ విప్గా కొనసాగుతున్న అరవ శ్రీధర్ తన విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా పత్రాన్ని పవన్కల్యాణ్కు అందజేశారు. ఇక బాలరాజుపై వచ్చిన ఫిర్యాదులపై నాలుగు వారాల్లో చక్కదిద్దుకోవాలని సూచించారు.