హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): హైకోర్టు నిర్మాణానికి వ్యవసాయ యూనివర్సిటీ భూములను ఇవ్వొద్దంటూ నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దాడిని బీఆర్ఎస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్ ఖండించారు. జీవ వైవిధ్యానికి విఘాతం కలిగించడంతోపాటు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాల్సిన భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కొత్త హైకోర్టు భవనం పేరుతో గుంజుకోవడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 55ను వెనక్కి తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డిని డిమాండ్ చేస్తూ ‘ఎక్స్’లో ఆయన పోస్టు చేశారు. దాసోజు ‘ఎక్స్’ పోస్ట్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రీ పోస్ట్ చేశారు.
మరోవైపు, ఏబీవీపీ కార్యకర్త ఝాన్సీపై దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అమానవీయ చర్యగా పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీఎం రేవంత్రెడ్డి వెంటనే స్పం దించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కోరారు. హైకోర్టుకు 100 ఎకరాలు కేటాయించడాన్ని సమీక్షించి, అవసరం ఉన్నంత మేరకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ పోలీసులు వ్యవహరించిన తీరును చూసి సభ్యసమాజం అసహ్యించుకుంటున్నదని మండిపడ్డారు. ఇంతకంటే హేయం మరొకటి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సమగ్ర న్యాయ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.