హైదరాబాద్: 317 జీవో బాధితులు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహను హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. తమ సమస్యల పరిష్కారంపై రూపొందించిన వినతి పత్రాన్ని ఆయనకు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం 317 జీవోపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా దామోదర రాజనర్సింహను నియమించినందున బాధితులు ఆయన దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారు.
క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకునే నిర్ణయంతో రాష్ట్రంలోని ఉద్యోగులు, వారి కుటుంబాలతోపాటు తమ స్థానికత, పదోన్నతులు, బదిలీలు, స్పౌజ్ కేసుల సమస్యలు పరిష్కారమవుతాయని మంత్రికి విజ్ఞప్తి చేశారు. 317 జీవో సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీలో బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతుగా చర్చిస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ బాధితులకు భరోసానిచ్చారు. 317 జీవో బాధితులు చేసిన విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించారు.
బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి రాజనర్సింహ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు వెన్నంటి నిలుస్తుందన్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసిన వారిలో 317 జీవో బాధితులు రాపోలు శేఖర్, నిరీక్షణ, దీపిక, అనిత, గుగులోత్ మధు, రాథోడ్ కిరణ్, ఆలూరు మంజుల, పల్లవితోపాటు పలువురు ఉన్నారు.