కలెక్టరేట్, జనవరి 22: దళితుల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు పథకం నిధులను అధికారులు ఫ్రీజింగ్ చేయడంపై హుజూరాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి విడత రూ.5 లక్షలు ఇచ్చి, రెండో విడత ఇవ్వడకపోవడంపై కన్నెర్రజేశారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి జమ్మికుంట, వీణవంక, హుజురాబాద్, ఇల్లందకుంట మండలాల నుంచి 60 మంది లబ్ధిదారులు తరలివచ్చారు. హుజురాబాద్ సెగ్మెంట్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన పథకంలో తమకు తొలి విడత డబ్బులు అందజేశారని, వివిధ యూనిట్లు పెట్టుకొని బతుకుతున్నామని తెలిపారు. అయితే.. రెండో విడత రూ.5 లక్షలు విడుదల చేయకపోగా, ఫ్రీజింగ్ చేశారని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ను కలిసి ఫిర్యాదు చేశారు.
ఫ్రీజింగ్ ఎత్తివేయించాలని వేడుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే నిధులు విడుదల చేయాల్సి ఉన్నా.. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం, ఇతర అధికారులకు ఇన్చార్జి కూడా ఇవ్వకపోవడంతో నిధుల విడుదల నిలిచిపోయిందని వాపోయారు. దీంతో పక్కనే ఉన్న ఈడీని అదనపు కలెక్టర్ పిలిచి విచారించారు. ఎన్నికల కోడ్తో నిధుల విడుదలకు అనుమతులు రాలేదని వివరించిన ఈడీ.. ఫిర్యాదుదారులను పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతుండగా ఒక్కసారిగా చుట్టుముట్టారు. రన్నింగ్ యూనిట్లకు కొత్త ప్రభుత్వ గైడ్లైన్స్ అవసరమా? అంటూ ప్రశ్నించారు. కావాలనే తమను ఇబ్బందులు పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకోవడంతో శాంతించారు.
భువనగిరి కలెక్టరేట్: దళితబంధు పథకం నిధులు వెంటనే విడుదల చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు, మోతూరు మండలాల లబ్ధిదారులు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ జీ వీరారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దళితబంధు లబ్ధిదారులు మాట్లాడుతూ.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెండు మండలాల్లోని మొత్తం లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున వేశారని, మిగతా నిధులు విడుదల చేస్తే ఉపాధి మార్గం చూసుకుంటామని పేర్కొన్నారు.