ఎదులాపురం, మార్చి 17 : జిల్లాలో దళితబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో దళిత బంధు పథకం అమలుపై గురువారం ప్రత్యేక అధికారులు, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. యూనిట్లపై ఆయా శాఖల అధికారులు లబ్ధిదారులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, లబ్ధిదారులకు స్థానిక మార్కెటింగ్ను బట్టి యూనిట్ను ఎంచుకొని ఆర్థికంగా ఎదగడానికి సహకరించాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జడ్పీ సీఈవో గణపతి, డీఆర్డీవో కిషన్, ఎల్డీఎం చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆశాకుమారి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రంగారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, జడ్పీ డిప్యూటీ సీఈవో రాజేశ్వర్ రాథోడ్, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
తాంసి, మార్చి 17 : ఉపాధిహామీ కూలీలకు పని ప్రదేశంలో కనీస వసతులైన నీడ, తాగునీరు కల్పించాలని సంబంధిత ఈజీఎస్ అధికారులను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మండలంలో వడ్డాడి, పొన్నారిలో ఉపాధిహామీ పనులకు పరిశీలించారు. కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు కూలీలు తాము పనిచేసిన రోజులకు సంబంధించిన కూలీ డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సంబంధిత అధికారులను ఈ విషయంపై ఆరా తీశారు. మస్టర్లు పంపించామని, నాలుగు వారాల డబ్బులు త్వరలో రావచ్చని చెప్పారు. అనంతరం పొన్నారిలోని జిల్లా పరిషత్, ఉన్నత పాఠశాలను పరిశీలించారు. వంటగదిని తనిఖీ చేశారు. గ్రామంలోని హరితహారం నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. డీఆర్డీవో ఏపీడీ రాథోడ్ రవీందర్, ఎంపీడీవో రవీందర్, ఏపీవో విజయ, ఎంపీవో సుధీర్రెడ్డి, సర్పంచులు సౌందర్య, సంజీవ్రెడ్డి, ఎంపీటీసీ రేఖ, ఉప సర్పంచ్ అశోక్, టీఏలు అస్మిన్, రాజన్న పాల్గొన్నారు.