కార్పొరేషన్, జనవరి 21: దళిత వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన దళితబంధు దేశంలోనే గొప్ప పథకమని.. కేసీఆర్తోనే అంబేద్కర్ కలలు సాకారమవుతాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్ర వారం కరీంనగర్ కలెక్టరేట్లో దళితబంధు అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. అర్హులందరికీ దళితబంధు ఫలాలను అందిస్తామని స్పష్టంచేశారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన హుజూరాబాద్లో 17,556 కుటుంబాల ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేశామని తెలిపారు. డెయిరీ యూనిట్లను ఎంపిక చేసుకొన్న 1,500కుపైగా కుటుంబాలకు శిక్షణ ఇప్పించామని, 6,800 మంది వాహనాల కోసం దరఖాస్తు చేసుకోగా, అర్హులందరికీ లైసెన్స్లు ఇప్పించామని గుర్తుచేశారు. మార్చి 31లోగా మొదటి దశ కింద వంద జిల్లాల్లోని మూడు నియోజకవర్గాల్లో దళితబంధు అమలు చేస్తామని స్పష్టంచేశారు. సమావేశంలో కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు.
కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో శుక్రవారం మంత్రి గంగుల కమలాకర్ 24 మంది దళితబంధు లబ్ధిదారులకు రూ.2.60 కోట్ల విలువైన ఆరు హార్వెస్టర్లు, 3 జేసీబీలు, ఒక డీసీఎం వ్యాన్ను పంపిణీ చేశారు. తమ బతుకుల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్కు బతికినంత కాలం రుణపడి ఉంటామని లబ్ధిదారులు తెలిపారు.