హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోజుకు 162.68 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, అంజయ్య, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, గొంగిడి సునీత, చెన్నమనేని రమేశ్ అడిగిన మౌఖిక, లిఖితపూర్వక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రూ.246.25 కోట్లతో రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద రోజుకు 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో గ్రీన్ఫీల్డ్ మెగా డెయిరీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దళితబంధు లబ్ధిదారుల్లో ఎక్కువ మంది మినీ డెయిరీల ఏర్పాటు పట్ల ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. పంటల మార్పిడితో పాడిపరిశ్రమ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉన్నదని అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లోని రైతులను విజయ డెయిరీకి పాలు పోసేలా ప్రోత్సహించాలని కోరారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాల ద్వారా కులవృత్తులు వికసిస్తున్నాయని చెప్పారు.