హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 25 : ప్రస్తుత కాలంలో గుర్తుతెలియని వ్యక్తి కారును టచ్ చేస్తే.. ఆ కారు వెంటనే సౌండ్ చేస్తూ యజమానిని అప్రమత్తం చేస్తుంది. అలాంటి వ్యవస్థ వాహనాలకే ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు దాచి ఉంచే బ్యాంకింగ్ సర్వర్లకు ఏ స్థాయిలో ఉండాలి? కానీ.. కొన్ని బ్యాంకులు పటిష్ఠమైన సైబర్ భద్రతా ఏర్పాట్లు చేసుకోకపోవటంతో సైబర్ నేరగాళ్లు ఈజీగా బ్యాంకింగ్ సర్వర్లపై దాడులు చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు. తమ వద్ద ఉన్న సెక్యూరిటీ వ్యవస్థను మెరుగుపరుచుకోకపోవటంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకొంటున్నాయి. ఇందుకు టెస్కాబ్, మహేశ్ బ్యాంకుల ఘటనలనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
గత జులైలో సైబర్నేరగాళ్లు తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు సర్వర్ను హ్యాక్ చేసి రూ.1.96 కోట్లు దోచేశారు. ఈ బ్యాంకు సహకార బ్యాంకులలో తమదే గొప్ప సెక్యూరిటీ అంటూ చెప్పుకొన్నది. అయినా నేరగాళ్లు ఈ బ్యాంక్ సర్వర్పై దాడి చేశారు. తాజాగా మహేష్బ్యాంక్ సర్వర్ను అటాక్ చేసి ఏకంగా రూ.12.4 కోట్లు కొట్టేశారు.
సర్వర్లలో లోపాలే కారణం
శత్రు దుర్భేద్యంగా ఉండాల్సిన బ్యాంకింగ్ సర్వర్లలో లోపాలు ఉండటంతోనే హ్యాకర్స్ ఈజీగా చొరబడుతున్నారు. ఎక్కువగా చిన్న బ్యాంకులనే లక్ష్యంగా ఎంచుకొంటున్నారు. సహకార బ్యాంకుల సైబర్ సెక్యూరిటీలో ఉండే లోపాలను ఆసరాగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు. సెలవు రోజుల్లో సర్వర్ల నుంచి ఈజీగా డబ్బును దోచేస్తున్నారు. ఒక సర్వర్పై దాడి చేసేందుకు రెండు మూడు నెలలు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ముందుగా ఆ బ్యాంకులో ఖాతాలు తెరిపించటం, తరువాత దోచేసిన సొమ్మును వివిధ ఖాతాల్లోకి మళ్లించేందుకు దేశ వ్యాప్తంగా ఉండే నెట్వర్క్తో వివిధ బ్యాంకులలో ఖాతాలు సేకరిస్తున్నారు. ఇలా సర్వర్లపై దాడిచేసి సొమ్మును గంటల వ్యవధిలోనే ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు అలా ఇంకో ఖాతాకు బదిలీ చేస్తూ తమ చేతుల్లోకి తీసుకొంటున్నారు. ఒకసారి డబ్బు సైబర్నేరగాళ్ల చేతిలోకి వెళ్లిందంటే.. తిరిగి రాబట్టడం అసాధ్యమే. పోయిన సొమ్మును ఖాతాదారులకు అందించాల్సిన బాధ్యత బ్యాంకులదే. కొన్ని బ్యాంకులు ఇన్సూరెన్స్ చేయించి తమకేమీ ఢోకా లేదనే భావనలో ఉంటూ సైబర్ సెక్యూరిటీని విస్మరిస్తున్నాయి. ఇలాంటి సమస్యలను గుర్తించిన ఆర్బీఐ సహకార బ్యాంకులకు సైబర్ సెక్యూరిటీ విషయంలో నియమనిబంధనలు జారీ చేసింది. అయినా కొన్ని బ్యాంకులు అశ్రద్ధ వహిస్తున్నారు.
బలమైన ఫైర్వాల్స్తో భద్రత..
పేరున్న ప్రైవేట్ బ్యాంకులు, జాతీయ బ్యాంకులకు సంబంధించిన సైబర్ సెక్యూరిటీ విభాగం పటిష్ఠంగా ఉంటుంది. బలమైన ఫైర్వాల్స్ను ఏర్పాటు చేసుకోవటంతోపాటు సాఫ్ట్వేర్లను కాలానికి అనుగుణంగా అప్డేట్ చేస్తూ వెళ్తారు. కొన్ని బ్యాంకులు ఐదంచెల భద్రతా వ్యవస్థను నిర్వహిస్తున్నాయి.