న్యూఢిల్లీ, జూన్ 2: ఐఫోన్లే లక్ష్యంగా హ్యాకర్లు దాడికి పాల్పడుతున్నట్టు సైబర్ సెక్యూరిటీ నిపుణులు శుక్రవారం హెచ్చరించారు. ఇప్పటికే గుర్తు తెలియని మాల్వేర్ ఉన్న ఫోన్లపై ఐమెసేజ్ ద్వారా నియంత్రణ సాధిస్తున్నారని తెలిపారు. సైబర్ సెక్యూరిటీ కంపెనీ కాస్పెర్స్కై ఈ హ్యకర్ల దాడిని గుర్తించింది. ఈ సంస్థలోని కార్పొరేట్ వైఫై నెట్వర్క్ ట్రాఫిక్ను పర్యవేక్షిస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కంపెనీలోని పదుల సంఖ్యలో ఉద్యోగుల ఐవోఎస్ డివైస్లను హ్యాకర్లు టార్గెట్ చేసినట్టు గుర్తించారు.
ఈ దాడిని ‘ఆపరేషన్ ట్రయాంగులేషన్’గా పిలుస్తున్నారు. హ్యాకర్లు ఐఫోన్లలోకి క్లిక్ చేయకుండానే పని చేసే ఒక లింక్ను పంపించి ఫోన్ను పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకుంటున్నట్టు సైబర్ నిపుణులు తెలిపారు. ఒకసారి ఫోన్ నియంత్రణలోకి వచ్చాక సదరు మెసేజ్ దానికదే డిలీట్ అవుతున్నట్టు చెప్పారు. మైక్రోఫోన్ రికార్డింగ్లు, జియోలొకేషన్, మెసెంజర్ల నుంచి ఫోటోలు, తదితర వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు పొందుతున్నట్టు అనుమానిస్తున్నారు. యూజర్లపై గుట్టుగా గూఢచర్యానికి పాల్పడటమే హ్యాకర్ల లక్ష్యంగా భావిస్తున్నారు. కేవలం ఇది కాస్పెర్స్కై ఉద్యోగులే లక్ష్యంగా చెస్తున్న దాడి కాదని, బయటి వారి ఫోన్లకు ముప్పు ఉన్నదని అనుమానిస్తున్నారు.