ఎదులాపురం : రోజుకో సైబర్ నేరం కొత్తతరహలో పుట్టుకొస్తుంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీ అధికారినంటూ బంగారం కొనుగోలు చేసి గూగుల్ పేతో డబ్బులు చెల్లించినట్లు మెసేజ్ పంపి బంగారం వ్యాపారిని మోసం చేశాడు. ఆదిలాబాద్ వన్టౌన్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 1న పట్టణంలోని నేతాజీ చౌక్లోని డీబీ జ్యువెల్లరీ దుకాణానికి టిక్టాక్గా వచ్చిన అగంతకుడు తాను ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారి నిరంజన్ అంటూ ఐడీ కార్డు చూయించి పరిచయం చేసుకుని దుకాణానికి సంబంధించిన జీఎస్టీతో పాటు పలు పత్రాలున్నాయంటూ నిలదీశాడు.
అనంతరం రూ.1.87 లక్షల విలువ గల బంగారు ఆభరణాలను కొన్నాడు. దీనికి సంబంధించి గూగుల్పే చేశాడు . సంబంధిత మెసేజ్ను షాపు యజమాని చూసుకుని ధృవీకరించుకున్నాడు. తరువాత ఐటీ అధికారినని చెప్పిన వ్యక్తి ఆభరణాలతో వెళ్లిపోయాడు. షాపు యజమాని మరుసటి రోజు తన బ్యాంకు స్టేట్మెంట్ చూసుకోగా రూ. 1.87 లక్షల మొత్తం తన ఖాతాలో జమకాలేదని గమనించాడు. బ్యాంకుకు వెళ్లి అడగగా ఈ మొత్తం అసలు మీ ఖాతాలో జమనే కాలేదని వారు వెల్లడించడంతో తాను మోసపోయానని గ్రహించిన జ్యువెల్లరీ యజమాని జ్ఞానేశ్వర్ పోలీస్లకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించగా ఆగంతకుడు తీసుకువచ్చిన కారు నంబరు కూడా నకిలీదేనని నిర్దారించుకున్నారు.
నిరంజన్ అని చెప్పుకున్న వ్యక్తి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాడిగా భావిస్తున్నామని ఆయన పై పలు కేసులు ఉన్నట్లు అనుమానిస్తున్నామని సీఐ రామకృష్ణ తెలిపారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.