వ్యవసాయ యూనివర్సిటీ, నవంబర్ 25 : వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు సాధ్యమని, అందులో శాస్త్రవేత్తలదే కీలకపాత్ర అని యూఎస్ఏ కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజ్ఖోస్లా అన్నారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 5వ అంతర్జాతీయ అగ్రానమీ సదస్సులో గురువారం మూడోరోజు సెషన్ జరిగింది. ప్రొఫెసర్ రాజ్ఖోస్లా ఆన్లైన్లో మాట్లాడుతూ.. బిగ్డాటా అనాలిటిక్స్, ప్రెసిషన్ అగ్రికల్చర్, డిజిటల్ ఇంటెలిజెన్స్ వ్యవసాయరంగంలో కీలకమని అన్నారు.
ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించడానికి.. చిన్న, సన్నకారు రైతుల ఆదా యం పెరగడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన డిజిటల్ టూల్స్ అత్యవసరమని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని ముడ్రోజ్ యూనివర్సిటీ ఫ్యూచర్ ఫుడ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ డాక్టర్ సైమన్కుక్, మొరాకోకు చెందిన డాక్టర్ బ్రూనో గెరార్డ్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల వల్ల సంభవించే పంటనష్టాన్ని అధిగమించడానికి కన్జర్వేషన్ అగ్రికల్చరల్ విధానాన్ని అనుసరించాలని సూచించారు. డిజిటలీకరణ వ్యవసాయ పద్ధతులు అవలంబించడంతో ఉత్పత్తిలో రైతుల ఆదాయంలోనూ మార్పులు వచ్చాయని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.