Cowpea | చంద్రశేఖర్ ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ (CSA) శాస్త్రవేత్తలు సోయా పాలకు ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నారు. కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సీమా సోంకర్ అలసందల (cowpea)తో పాలను సిద్ధం చేశారు. ఇవి సోయా పాలకంటే రుచిగా ఉంటాయని, ఆవు, గేదె పాల కంటే కొంచెం తియ్యగా ఉంటాయి. వీటి రంగు సైతం తెలుపు రంగులోనే ఉంటాయి. ఈ పాల ప్రత్యేకత ఏంటంటే.. అందరు సొంతంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
వీటిలో సాధారణ పాలలో ఉండే అన్ని పోషకాలు ఉన్నాయని, అలసందల్లోని గుణాలు సైతం ఉంటాయని డాక్టర్ సీమ తెలిపారు. దీంతో ఈ పాలు మరింత ప్రయోజనకరంగా ఉంటాయని, మంచి జీర్ణశక్తిని కలిగి ఉంటాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఆవు పాలను తయారు చేసిన తర్వాత వచ్చే మిగిలే వ్యర్థాలతో మిఠాయిలు తయారు చేసే పనిలో నిమగ్నమైనట్లు వివరించారు. కమ్యూనిటీ సైన్స్ కళాశాల డీన్ డాక్టర్ పీకే ఉపాధ్యాయ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో అలసంద పాలు అందుబాటులో లేవని, ఈ సాంకేతికతను పేటెంట్ కోసం పంపి, ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
ఈ పాలతో టీ తయారు చేసుకోవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ సీమ పాల తయారీ విధానాన్ని సైతం వివరించారు. 200 గ్రాముల అలసందలను రాత్రంతా నీటిలో నానబెట్టుకొని.. ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. అర లీటర్ నీటిని విడిగా తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో గింజలను వేసుకొని, కొంచెం కోంచెం నీటిని పోస్తూగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని బయటకు తీసి.. గుడ్డ సహాయంతో వడకట్టుకోవాలి. అదే మిశ్రమాన్ని మరోసారి మిక్సీలో వేసుకొని.. గ్రౌండ్ చేసుకోవాలి.
ఇలా మూడునాలుగు సార్లు మిశ్రమాన్ని గ్రౌండ్ చేసుకుంటే.. 200 గ్రాముల అలసందల నుంచి 700 మిల్లీ లీటర్ల పాలను తయారు చేసుకోవచ్చు. ఈ పాలతో చాయ్తో పాటు, టోఫు పనీర్ (సోయాబీన్స్ నుంచి తయారు చేసే పనీర్) చేసుకోవచ్చు. ఈ పాలను తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఇవి గుండెకు మేలు చేస్తాయి. పాలల్లో ఐరన్ ఉండడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం, బరువును తగ్గించడంతో పాటు ప్రోటీన్, ఫైబర్ ఇలా అనేక పోషకాలు అందుతాయి.