హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కలెక్టర్లు, వైద్య, ఆరోగ్యశాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల అధికారులతో సీఎస్ సోమేశ్కుమార్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్నరెండు రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్ తదితర జిల్లాల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, అన్ని దవాఖానల్లో వైదులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని అన్నారు. అదేవిధంగా సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని అన్నారు.
ఎండ తీవ్రతతో ఏవిధమైన ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఎండల ప్రభావంతో కలిగే ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యం చేయాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పాఠశాల సమయాన్ని మరింత తగ్గించాలని, అదేవిధంగా ఉపాధిహామీ కూలీలు ఎండలో పని చేయకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అన్ని జిల్లాల కలెక్టర్లతోపాటు ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, పంచాయతీ రాజ్, విద్యా శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషన్ మాణిక్ రాజ్, వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న పాల్గొన్నారు.