వచ్చే ఏడాది నుంచి ఆదాయాన్ని పేర్కొనాల్సిందే: రెవిన్యూ కార్యదర్శి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: వచ్చే ఏడాది ఆదాయం పన్ను రిటర్ను (ఐటీఆర్)ల్లో క్రిప్టోకరెన్సీల నుంచి పొందే ఆదాయం కోసం కూడా ప్రత్యేకంగా ఓ కాలమ్ ఉంటుందని రెవిన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. బుధవారం పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇకపై క్రిప్టో ఆదాయాన్నీ ఐటీఆర్లలో పేర్కొనాలని, పన్నులు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను మంగళవారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతూ క్రిప్టో ఆస్తుల నుంచి అందుకునే ఆదాయం, లాభాలపై గరిష్ఠంగా 30 శాతం పన్ను ఉంటుందని, క్రయవిక్రయాలపై 1 శాతం టీడీఎస్ కూడా పడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తరహా బహుమతులకూ వర్తిస్తుందన్న సంగతీ విదితమే. దీంతో ఈ మేరకు ఐటీ రిటర్నుల్లో ప్రత్యేకంగా ఓ కాలమ్ ఏర్పాటు చేస్తున్నామని బజాజ్ ఈ సందర్భంగా వెల్లడించారు. ‘వచ్చే ఏడాది ఐటీఆర్ ఫారంలో క్రిప్టో కోసం ఓ ప్రత్యేక కాలమ్ కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన ఆదాయాన్ని ప్రకటించాల్సిందే’ అన్నారు. నిజానికి క్రిప్టోకరెన్సీల ఆదాయంపై పన్నులు ఎప్పుడూ ఉంటాయని, బడ్జెట్లో ఇది కొత్తగా తెచ్చిన పన్నేమీ కాదని, కేవలం ఈ అంశంపై స్పష్టతనే ఇచ్చారన్నారు. కాగా, ఇది దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ) కాకపోవచ్చన్న బజాజ్.. ఇదో వ్యాపార ఆదాయమని, అందుకే 30 శాతం పన్ను అన్నారు. ఇక టీడీఎస్తో క్రిప్టో లావాదేవీల సమాచారం ఆటోమెటిగ్గా ఐటీ శాఖకు చేరుతుందన్నారు. ఏప్రిల్ 1 కంటే ముందు పొందిన క్రిప్టో ఆదాయాన్నీ ఐటీఆర్లో ఎక్కడైనా చూపవచ్చని, కానీ దీనిపై ఐటీ అధికారులదే నిర్ణయమన్నారు.
ఆమ్నెస్టీ పథకం కాదు
మరోవైపు అదనపు పన్ను చెల్లింపుల ద్వారా ఐటీఆర్ అప్డేషన్ కోసం ట్యాక్స్పేయర్లను రెండేండ్లు అనుమతించింది ఆమ్నెస్టీ పథకంలో భాగంగా కాదని, కేవలం విస్మరించిన ఆదాయం ప్రకటన, తప్పులను సరిదిద్దేందుకేనని బజాజ్ చెప్పారు. ఇదిలావుంటే క్రిప్టో పన్ను.. మార్కెట్పై ఐటీ శాఖ ఓ అంచనాకు రావడానికి దోహదం చేయగలదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ జేబీ మహాపాత్ర అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ పన్నుతో క్రిప్టో ఆస్తులలో వ్యాపారాన్ని చట్టవిరుద్ధంగా భావించడం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పినైట్టెంది.
క్రిప్టో కూడా జూదమేనా? ‘క్రిప్టో క్రయవిక్రయాలు చట్టవిరుద్ధం కాదు. బెట్టింగులు, గుర్రపు పందేలు, ఇతర గ్యాంబ్లింగ్ గేమ్స్ నుంచి గెల్చుకున్న సొమ్ముగానే క్రిప్టో ఆదాయాన్ని చూస్తున్నాం. అందుకే వాటిపై ఎటువంటి పన్ను విధానం అమలవుతున్నదో దాన్నే వర్తింపజేసి పన్ను విధిస్తున్నాం’ అని బ్లూంబర్గ్ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ అన్నారు. ‘భవిష్యత్తులో క్రిప్టో నియంత్రణకు ఏం జరుగుతుందోనన్నదానిపైనే ఇప్పుడు చర్చ. ప్రభుత్వం అన్నివైపులా అందరి అభిప్రాయాలనూ తీసుకుంటున్నది. అంతర్జాతీయంగా క్రిప్టో లావాదేవీలపై ఎటువంటి పరిస్థితులున్నాయో కూడా గమనిస్తున్నది’ అన్నారు.