హైదరాబాద్; మే 4 (నమస్తే తెలంగాణ): విశాఖ నగరవాసుల్ని ఎంతో కాలంగా ఊరిస్తున్న క్రూజ్ (విహార నౌకల) సదుపాయం త్వరలో అందుబాటులోకి రానున్నది. ఎంప్రెస్ అనే నౌక విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వెళ్లి తిరిగి విశాఖకు వస్తుంది. ఈ నౌకా విహార సర్వీసు నిర్వహణపై నౌకాశ్రయ అధికారులు, జేఎం బక్షీ సంస్థ ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరింది. వచ్చేనెల 8న సర్వీసు మొదలవుతుంది. తర్వాత 15, 22 తేదీల్లో కూడా విహారయాత్రలుంటాయి. ఇంటీరియర్ స్టాండర్డ్ రూం, ఓషన్ వ్యూ స్టాండర్డ్ రూం, మినీ సూట్ రూం పేరిట నాలుగు విభాగాలు నౌకలో ఉన్నాయి. ఒక్కో విభాగానికి ఒక్కో ధర ఉంటుంది. ఈ నౌకలో అబ్బురపరిచే పలు వసతులు, రెస్టారెంట్లు, క్యాసినో అందుబాటులో ఉంటాయి. క్రూయిజ్ నౌకకు అనుమతులిచ్చినట్టు విశాఖ నౌకాశ్రయం చైర్మన్ కే రామమోహనరావు వెల్లడించారు. టికెట్ల విక్రయాలతో నౌకాశ్రయానికి సంబంధం లేదని తెలిపారు.