పాలకుర్తి, మార్చి 20: తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు, మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి చదువులో మొదటి వరుసలో ఉండే, వ్యాళ్ల హరీశ్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి అమెరికాలో సొంత సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు. తల్లి వ్యాళ్ల అనసూర్య పాలకుర్తి ఎంపీపీ, తండ్రి రాంరెడ్డి మాజీ సర్పంచ్. ఏడాదికోసారి సొంత ఊరికి వచ్చే హరీశ్రెడ్డి తన వంతుగా గ్రామంలో ఉన్న పాఠశాలను అభివృద్ధి చేయాలనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా, 120 మంది ఉన్న మారేడుపల్లి ప్రాథమిక పాఠశాలకు తరగతి గదుల కొరత ఉండడంతో రూ. 4లక్షలు వెచ్చించి రెండు తరగతి గదులు నిర్మించాడు. వీటికితోడు పాఠశాలలో విద్యార్థులకు డ్రెస్కోడ్, గ్రంథాలయం పుస్తకాలు, చిన్నపిల్లలకు కుర్చీలు, ఫర్నీచర్ ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం పాఠశాల ఇంగ్లిష్ మీడియం బోధనతోపాటు అన్ని సౌకర్యాలతో కళకళలాడుతున్నది. ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్, ఉపాధ్యాయులు, స్కూల్ యాజమాన్య కమిటీ సమష్టి కృషితో చుట్టు పక్క గ్రామాల నుంచి ప్రవేటు పాఠశాల విద్యార్థులు సైతం మారేడుపల్లి ప్రాథమిక పాఠశాలలో చేరుతున్నారు.
గ్రామంలో ఇంగ్లిష్ మీడియం చదువులు పేదవారికి అందాలన్న ఆలోచనతో, రెండు తరగతి గదులు నిర్మించాను. కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ప్రారంభించినప్పుడు, తనవంతుగా ఏదైనా చేయాలనే సంకల్పంతో పాఠశాలకోసం ఖర్చుచేశా. చుట్టుపక్కల గ్రామాల పాఠశాలల్లో పేద విద్యార్థుల ఉన్నత చదువులకోసం కూడా సహకారం అందిస్తున్నాను. ముఖ్యమంత్రి కేపీఆర్ దూరదృష్టితో ప్రభుత్వపాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. గ్రామీణప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
-ఎన్ఆర్ఐ వ్యాళ్ల హరీశ్ రెడ్డి
తెలంగాణ రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు తెచ్చే లక్ష్యంతో అమెరికా పర్యటనకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు అమెరికాలో ఎన్ఆర్ఐ-టీఆర్ఎస్ యువ నాయకుడు వ్యాళ్ల హరీశ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్కు చేరుకున్న మంత్రి కేటీఆర్కు తెలుగు రాష్ర్టాలకు చెందిన ఎన్ఆర్ఐలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛం అందించి ఘనస్వాగతం పలికారు. అక్కడ కాసేపు ఎన్ఆర్ఐలతో ముచ్చటించిన కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో జరుతున్న కార్యక్రమాలపై వివరిస్తూనే ‘మన ఊరు-మన బడి’కార్యక్రమం గురించి తెలుపుతూ ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్ఆర్ఐలు చేస్తున్న కృషిని అభినందించారు.