తెలంగాణ ఆవిర్భావ అనంతరం అభివృద్ధి పథంలో అగ్రగామిగా దూసుకువెళ్లిన రాష్ట్రంలో ప్రస్తుతం నిరాశా నిస్పృహలు చోటుచేసుకుంటున్నాయి. నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో సాగు సన్నగిల్లడం, పంటలు ఎండిపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఒక్క వ్యవసాయమే కాదు, అన్నిరంగాల్లోనూ సంక్షోభం తొంగి చూస్తున్నది. ఎడాపెడా హామీలు గుప్పించి జనాలను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు చేతులెత్తేయడమే ఇందుకు కారణం. స్వరాష్ట్ర సాధన తర్వాత అంచెలంచెలుగా అభ్యున్నతి సాధించిన తెలంగాణలో మరింత మెరుగైన ‘మార్పు’ వస్తుందని ఆశించిన సామాన్యులకు పరిస్థితి నానాటికీ దిగజారి పోతుండటం బెంబేలెత్తిస్తున్నది. ఆశలుడిగిన తెలంగాణలో రోజురోజుకు రైతుల ఆత్మహత్యలు పెరుగుతుండటం బాధాకరం.
వర్షాభావ పరిస్థితుల వల్ల, సర్కారు నిర్వహణ వైఫల్యం వల్ల రాష్ట్రంలో అనధికారిక అంచనాల ప్రకారం 15 లక్షల ఎకరాల్లో రూ.3,000 కోట్ల విలువైన పంటనష్టం జరిగింది. సకాలంలో వ్యవసాయానికి నీరు అందకపోవడమే ఇందుకు కారణం. ప్రాజెక్టులను నింపి నీళ్లు విడుదల చేసే పనికి రకరకాల సాకులతో కాంగ్రెస్ తిలోదకాలు ఇచ్చింది. నీళ్లను రాజకీయం చేసింది. దాంతో కాంగ్రెస్ పాలనలో సగటున రోజుకు ఇద్దరు రైతులు మృతి చెందుతున్నట్టు లెక్కలు తెలుస్తున్నాయి. ఇప్పటివరకు 209 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బీఆర్ఎస్ వెల్లడిస్తున్నది. కాగా, అసలు రైతులెవరూ ఆత్మహత్య చేసుకోలేదని మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. అంతకుముందే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చనిపోయిన రైతుల వివరాలు తెలియజేస్తే పరిహారం ఇస్తామని వెటకారం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎంతో కొంత భుక్తికి మార్గం పొందిన సిరిసిల్ల మరోసారి ఉరిసిల్లగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. చేతిలో పని లేక కుటుంబాలను పోషించుకునే దారి లేక అనేకమంది నేతన్నలు మృత్యువునే మార్గంగా ఎంచుకుంటున్నారని తెలుస్తున్నది. కానీ, ప్రభుత్వం వీటిని గుర్తించడం లేదు. ఇక మహబూబ్నగర్ జిల్లాలో రైతు ఆత్మహత్యను కూడా మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు జరిగాయి. ఇవన్నీ ప్రజల సమస్యలను గుర్తించడానికి కాంగ్రెస్ తిరస్కార ధోరణిని పట్టి చూపిస్తున్నాయి.
‘తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకుచావండి’ అన్న ధోరణిలో హామీలు ఇవ్వడం, ఆ తర్వాత వాటిని ఎగ్గొట్టడం కాంగ్రెస్కు మొదటినుంచీ అలవాటే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 420 హామీలు కూడా ఈ కోవకు చెందినవే. ఇప్పుడు తాజాగా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మరిన్ని హామీలతో కాంగ్రెస్ నిస్సిగ్గుగా మరోసారి ముందుకువస్తున్నది. పెట్టుబడి సాయాన్ని సమకూరుస్తూ వ్యవసాయానికి అండదండలు అందించే రైతుబంధులాంటి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది ప్రభుత్వ కనీస బాధ్యత. తద్వారా రాష్ట్ర ప్రజలకు ఎంతో కొంత ఉపశమనం కలుగుతుందనడంలో సందేహం లేదు. కానీ రాష్ట్రంలో ఆ దిశగా అడుగులు పడడం లేదు. పరిస్థితులను, పరిణామాలను గమనిస్తే తెలంగాణ వ్యవసాయరంగంలో 2014 ముందటి సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తున్నది.