ఇబ్రహీంపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన జైహింద్ నాయక్ హత్యపై ఎన్నో అనుమానాలు వెలుగులోకొస్తున్నాయి. జైహింద్ నాయక్ను దారుణంగా హత్యచేసి శరీరం నుంచి తలను వేరుచేసి నల్గొండ జిల్లా కుర్మేడు సమీపంలోని విరాట్నగర్ మెట్టు మహంకాళి దేవాలయంలో వదిలిపెట్టారు. ఈ సంఘటన జరిగిన వెంటనే స్పందించిన నల్గొండ పోలీసులు మొండెం కోసం గత నాలుగు రోజులుగా శ్రమిస్తున్నారు. ఎట్టకేలకు నగర శివారుల్లోని తుర్కయంజాల్లో ఓ నిర్మాణంలో ఉన్న భవనంలో జైహింద్నాయక్ మొండాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ హత్యవెనుక అడుగడుగునా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సుమారు వందమంది పోలీసులు 12 బృంధాలుగా విడిపోయి తలకు సంబంధించిన మొండెం కోసం గాలించారు. ఎట్టకేలకు తుర్కయంజాల్లో మొండెం లభించినప్పటికీ హంతకులెవరో తేలాల్సి ఉంది. హంతకుల గుర్తింపుకోసం అధికారులు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారు. తుర్కయంజాల్ నుంచి నల్గొండ జిల్లా చింతపల్లి వరకు సాగర్రహదారిలో ఉన్న ప్రతి సీసీ కెమెరాను జల్లెడపడుతున్నారు. హంతకులు ఎవరనేదానిపై నల్గొండ, రాచకొండ పోలీసులు పెద్ద ఎత్తున దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నల్గొండ సీసీఎస్ పోలీసులు, రాచకొండ ప్రత్యేక పోలీసు బృంధాలు నిందితుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ హత్యకేసు రెండు జిల్లాల పోలీసులకు పెను సవాల్గా మారింది.
ఉలికిపడిన తుర్కయంజాల్..
ఇప్పుడిప్పుడే వ్యాపారంగా ఎంతో అభివృద్ధి సాధించిన తుర్కయంజాల్ మున్సిపాలిటి జైహింద్నాయక్ హత్యతో ఉలిక్కిపడింది. నగరశివారులలో ఉన్న తుర్కయంజాల్ దినదినాభివృద్ధి చెందుతూ నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డిజిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వలసవచ్చి ఇక్కడ స్థిరనివాసాలేర్పర్చుకున్నారు. దీంతో తుర్కయంజాల్ వివిధ ప్రాంతాల సెటిలర్స్తో దినదినాభివృద్ధి సాధిస్తుంది. ఈ పరిస్థితిలో సూర్యపేటజిల్లా, పాలకవీడు మండలం, శూన్యపహాడ్తండాకు చెందిన జైహింద్నాయక్ గత సంవత్సర కాలంగా తుర్కయంజాల్కు వచ్చి బిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. మతిస్థిమితం లేని జైహింద్నాయక్ తుర్కయంజాల్లోని వివిధ ప్రాంతాల్లో బిక్షాటన చేస్తూ వచ్చిన దాంతో ఇక్కడే ఉంటున్నాడు. ఇదే క్రమంలో తుర్కయంజాల్లోని బ్రాహ్మణపల్లి సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవనంలో నివసిస్తున్నాడు. ఏం జరిగిందో ఏమో కాని, గతవారం రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు అతిదారుణంగా ఆయన తలను మొండెం నుంచి వేరుచేశారు.
తలను తీసుకుని నల్గొండ జిల్లా కుర్మేడు సమీపంలోని ఓ ఆలయం వద్ద వదిలిపెట్టి వెల్లారు. తలకు సంబంధించిన మొండెం కోసం పెద్ద ఎత్తున గాలించిన పోలీసులకు జైహింద్నాయక్ తుర్కయంజాల్లో బిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఈ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. దీంతో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో జైహింద్నాయక్ మృతదేహం లభ్యమవటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
సీసీ కెమెరాలను జల్లెడపడుతున్న పోలీసులు..
వారం రోజులుగా హత్యకేసు మిస్టరీని చేదించడానికి శక్తివంచన లేకుండా పని చేస్తున్న పోలీసులకు మొండెం లభించటంతో కొంతవరకు ఊరట లభించింది. అయినప్పటికీ హంతకులు ఆచూకీ లభించకపోవటంతో పోలీసులు సీసీకెమెరాలపై ఆధారపడ్డారు. తుర్కయంజాల్లో మొండెం లభించిన ప్రాంతం నుంచి మన్నెగూడ, బొంగుళూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్, కుర్మేడు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. గతవారం రోజుల నుంచి రాత్రి సమయంలో ఈ రహదారిలో వచ్చిపోయే వాహనాలను పరిశీలిస్తున్నారు. అలాగే, మొండెం లభించిన భవనం పక్కన ఉన్న హార్డవేర్ దుకాణం ముందు ఏర్పాటు చేసిన సీసీకెమెరాల పుటేజ్లను కూడా తీసుకున్నారు. అయినప్పటికీ హత్యకేసులో పురోగతి లభించటం లేదని పోలీసులు చెబుతున్నారు.
అడుగడుగునా అనుమానాలే..
అత్యంత దారుణంగా హత్యకు గురైన జైహింద్నాయక్ (30) హత్యలో అడుగడుగునా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిక్షాటన చేసుకునే జైహింద్నాయక్కు ఎలాంటి వ్యక్తిగత కక్ష్యలు కాని, ఇతరత్రా కక్ష్యలులేవు. దీంతో అతన్ని హత్యచేయాల్సిన అవసరం ఎవరికి ఉందన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, తన కుమారున్ని గుప్తనిధుల కోసం లేదా, వాస్తు దోషాలు, వ్యాపారంలో నష్టపోయిన వారు ఎవరైనా నరబలి ఇచ్చి ఉంటారని మృతుని తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మృతుడి మొండెం లభించిన భవనం కూడా మొదటినుంచి వివాదాల్లో కూరుకుంది. ఈ భవనం కూడా కేశ్యానాయక్ అనే వ్యక్తి నిర్మించాడు. నిర్మాణం చేపట్టిన తరువాత కేశ్యానాయక్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో అతని ఇద్దరి భార్యలు ఈ భవనం కోసం కొట్లాడుకుని కోర్టును ఆశ్రయించారు.
కాగా ఇదే భవనంలో జైహింద్నాయక్ హత్యగావించటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఆరునెలలుగా మృతుడు జైహింద్నాయక్ తుర్కయంజాల్లో బిక్షాటన చేసి ఇదే భవనంలో నివసిస్తున్నాడు. మృతుడు ఇక్కడే హత్యచేసి ఉంటారని అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఈ భవనంలో మృతుడికి సంబంధించిన మూడు కవర్లను కూడా పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన మిస్టరీ మరో రెండుమూడు రోజుల్లో వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పూర్తయిన పోస్టుమార్టం..
తుర్కయంజాల్లోని నిర్మాణంలో ఉన్న భవనంలో తలలేని మొండెం లభ్యమైన జైహింద్నాయక్ మృతదేహానికి శుక్రవారం వనస్థలిపురం, చింతపల్లి పోలీసులు పోస్టుమార్టం పూర్తి చేశారు. నగరంలోని ఉస్మానియా దవాఖానకు మృతదేహాన్ని తరలించి అతని తండ్రి, బంధువుల సమక్షంలో పోస్టుమార్టం పూర్తి చేశారు. పోస్టుమార్టంకు సంబంధించిన వివరాలు మరో రెండురోజుల్లో పోలీసుల చేతికి రానున్నాయి. పోస్టుమార్టంలో మరిన్ని నిజాలు వెలుగులోకి రానుండటంతో పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా గురువారం రాత్రి మృతదేహం లభ్యమైనప్పటికీ శుక్రవారం పోలీసులు, క్లూస్టీం ఆధ్వర్యంలో శవ పంచనామా నిర్వహించారు.