ప్రపంచంలో మార్పు తప్ప ఏదీ శాశ్వతం కాదు.. అంటూ ఐఎస్బీ క్యాంపస్లో బోధించే ఛేంజ్ మేనేజ్మెంట్ పాఠాలు తొమ్మిదో తరగతి వరకే చదువుకున్న భాగ్యలక్ష్మమ్మకు ఎలా తెలిశాయో! వెదురును చాపలు, బుట్టల తయారీకే పరిమితం చేయకుండా… ఇంటీరియర్ డెకొరేషన్లో భాగం చేసింది. వ్యాపారాన్ని ఆన్లైన్కూ విస్తరించింది.
భాగ్యలక్ష్మమ్మ .. స్వస్థలం నారాయణపేట జిల్లా కొల్లంపల్లి. అడవుల్లో దొరికే వెదురే ఆ కుటుంబానికి ఉపాధి. బాల్యంలో వెదురు బద్దలతో ఆడుకునేది, ఇష్టమైనట్టు మలుచుకునేది. తను తొమ్మిదో తరగతి వరకు చదివింది. బడికెళ్తూనే చేటలు, బుట్టలు తయారుచేస్తూ కుటుంబానికి ఆసరా ఇచ్చింది. పెండ్లి తర్వాత.. అత్తింటికి అండగా నిలబడింది. భర్త ప్రోత్సాహంతో పదో తరగతి పూర్తిచేసింది. కొల్లాపూర్ అటవీ ప్రాంతం నుంచి వచ్చే వెదురును కొనుగోలు చేయడం.. భర్త శివకుమార్తో కలిసి చాపలు, చేటలు, బుట్టలు అల్లి వారాంతపు సంతల్లో విక్రయించడం ఆమె వ్యాపకం. ఆ కొద్దిపాటి ఆదాయంతో జీవితాన్ని వెళ్లదీయడం భారంగా అనిపించేది. అప్పుడే, కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే, వెదురుతో ప్రయోగాలు మొదలుపెట్టింది.
ఆ సృజన చూసి డీఆర్డీవో అధికారులు హస్తకళల దిశగా ప్రోత్సహించారు. ఇదే లక్ష్మమ్మ జీవితాన్ని మలుపు తిప్పింది. వెదురు అలంకరణ వస్తువులను బహుమతిగా ఇవ్వడం ఓ ట్రెండ్గా మారడాన్ని గమనించిందామె. నారాయణపేట, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు ఏ ప్రముఖులు వచ్చినా భాగ్యలక్ష్మమ్మ తయారు చేసిన వెదురు వస్తువులనే జ్ఞాపికగా ఇచ్చేవారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తదితరులకు సైతం ఆ కళారూపాలు అందాయి. భాగ్యలక్ష్మి అభిమానుల్లో సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. దీంతో ఆర్డర్లు పెరిగాయి. గృహాలంకరణ వస్తువులు, ఆటబొమ్మలు.. ఆమె చేతితో ఏం తయారు చేసినా ఇట్టే అమ్ముడయ్యేవి. దీంతో, వ్యాపార విస్తరణకోసం రూ.10లక్షల రుణం తీసుకున్నది. ‘భాగ్యలక్ష్మి హ్యాండిక్రాఫ్ట్స్’ పేరుతో ఐదేళ్లక్రితం ఓ సంస్థను ప్రారంభించింది. వ్యాపారం దినదినాభివృద్ది చెందింది. ప్రస్తుతం భాగ్య
లక్ష్మమ్మ నెలకు రూ.70 వేల వరకూ సంపాదిస్తున్నది. కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నది.
ఇంటీరియర్లోనూ..
ఇంటీరియర్ డెకొరేషన్లో ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా వెదురును వాడుతున్నారు. వెదురు ప్యానల్స్ను పైకప్పుగా, వెదురు తడికెలను పార్టిషన్లా ఏర్పాటు చేసుకుంటున్నారు. రెస్టారెంట్ల డిజైనింగ్లోనూ వెదురు ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలో ఫ్లోరింగ్తోపాటు తలుపులు, ఫర్నిచర్, అల్మారాలు, కుర్చీలు, టేబుళ్లు, సోఫాసెట్లు.. ఇలా అభిరుచులకు తగ్గట్టుగా రకరకాల అలంకరణ వస్తువులు తయారవుతున్నాయి.. వెదురు వస్తువుల నిర్వహణ చాలా తేలిక. అప్పుడప్పుడూ తడిగుడ్డతో తుడిస్తే సరిపోతుంది. ఆరునెలలకోసారి వార్నిష్ వేయిస్తే కొత్త మెరుపు వచ్చేస్తుంది. మరమ్మతుల ఖర్చే ఉండదు. ఈ డిమాండ్ను అందిపుచ్చుకోవడంతో భాగ్యలక్ష్మమ్మ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది.
పిల్లలను చదివిస్తూ..
ఇప్పుడు, భాగ్యలక్ష్మమ్మ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకున్నది. పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తున్నారు. ముగ్గురు కొడుకులూ ప్రయోజకులే. పెద్దవాడు నవీన్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. రెండోబిడ్డ ప్రవీణ్ ఎంబీయే చేస్తున్నాడు. చిన్నబ్బాయి తరుణ్ అదిలాబాద్ రిమ్స్లో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్నాడు. సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు ముగ్గురూ వృత్తి పనుల్లో తల్లిదండ్రులకు సాయం అందిస్తారు. ‘ప్రస్తుతం అస్సాం నుంచి వెదురు దిగుమతి చేసుకుంటున్నాం. మా కళారూపాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆన్లైన్లోనూ ఆర్డర్లు వస్తున్నాయి. మరిన్ని కొత్త డిజైన్లను అందించే ప్రయత్నం చేస్తున్నాం’ అని వివరిస్తారు భాగ్యలక్ష్మమ్మ.
బిజినెస్ టెక్నిక్ నేర్పింది..
బిజినెస్ టెక్నిక్స్ కోసం మా ఆయనతో కలిసి ఏడాదిక్రితం ‘వీ హబ్’ను సంప్రదించాను. వ్యాపార విస్తరణ ప్రణాళికలపై అవగాహన కల్పించారు. ‘వీ హబ్’ అందించిన సహకారం నన్ను సరికొత్త మార్గంలో తీసుకెళ్తున్నది.
– కోస్కి భాగ్యలక్ష్మమ్మ