హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్ ఉభయసభల్లో ఎలాంటి చర్చ జరుపకుండా సాగు చట్టాల రద్దును ఆమోదించడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. లఖింపురి ఖేరిలో రైతులను తొక్కించిన ఘటనకు కేంద్రం సమాధానం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కొడుకే రైతులను హత్యచేశాడని ఫోరెన్సిక్ రిపోర్టులో బయటపడినా.. ఆ మంత్రిని పక్కనే ఎందుకు పెట్టుకున్నారని మండిపడ్డారు. రైతులను చంపేశాం.. క్షమించండి అన్నట్టుగా బీజేపీ ప్రభుత్వం తీరు ఉన్నదని ఆరోపించారు. ఉద్యమంలో 750 మంది రైతులు చనిపోయినా చలించకుండా.. యూపీ, పంజాబ్ ఎన్నికల కోసం సాగు చట్టాలను ఉపసంహరించుకున్నారని ధ్వజమెత్తారు. అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలని, చనిపోయిన రైతు కుటుంబాలకు పరిహారం అందజేయాలని, లఖింపురి ఘటనకు బాధ్యుడైన మంత్రిని తొలగించాలని నారాయణ డిమాండ్ చేశారు. అప్పటివరకు ఆందోళన కొనసాగుందని, దానికి సీపీఐ పూర్తిమద్దతు ఉంటుందని పేర్కొన్నారు.