హైదరాబాద్ : సినీనటుడు చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను భాషాదోషంగా పరిగణించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ విషయంలో తాను పశ్చాత్తాపం పడుతున్నట్లు చెప్పారు. బుధవారం విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడుతూ..‘ నా వ్యాఖ్యలతో చిరంజీవి అభిమానులు, కాపు మహానాడు నేతలు కొంత మందికి బాధ, మరికొంత మందికి ఆవేశం కలిగింది.
వారి బాధను నేను అర్థం చేసుకోగలను. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. అవిలేకుండా రాజకీయాలు ఉండవు. ఆ ప్రకారం నేను మాట్లాడిన మాటలు వాస్తవమే. రాజకీయ భాషను మించి చిరంజీవి గురించి మాట్లాడిన దాన్ని భాషా దోషంగా పరిగణించాలి. ఆ అంశాన్ని ఇక్కడితో వదిలేయాలి’ అని నారాయణ వ్యాఖ్యానించారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చిరంజీవిని ఆహ్వానించడంపై నారాయణ పలు వ్యాఖ్యలు చేశారు.
దీనిపై చిరంజీవి అభిమానులు, జన సైనికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో నారాయణ స్పందిస్తూ తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కోనసీమ జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో నారాయణ పర్యటనను చిరంజీవి అభిమానులు, జనసైనికులు అడుగడుగునా అడ్డుకున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్లపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.