హైదరాబాద్ : భారతదేశ వృద్ధి అవకాశాలను మెరుగుపరచకుండా, ప్రజలకు జీవనోపాధి లేకుండా చేస్తూ, కార్పొరేట్ దోపిడీదారుల కోసమే ప్రధాని మోదీ నిరంకుశ విధానాలు అవలంభిస్తున్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. మోదీ ప్రభుత్వ నిరంకుశ ప్రజా వ్యతరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో భాగంగా రెండోరోజు మంగళవారం హైదరాబాద్, మలక్పేట్, రేస్ కోర్స్ వద్ద హైదరాబాద్ రేస్ కోర్స్ ఎంప్లాయిస్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో వందలాదిమంది కార్మికులతో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్లకు సేవ చేయడం, కార్మికుల హకులను హరించడమే లక్ష్యంగా చేసుకొని ప్రధాని మోదీ కేంద్రంలో పాలన కొనసాగిస్తున్నాడని విమర్శించారు. మన పూర్వీకులు నిర్మించిన అపూర్వమైన దేశ సంపదను ప్రధాని మోదీ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ పేరుతో బడా కార్పొరేట్, ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నాడన్నారు. అలాగే సార్వత్రిక సమ్మెల్లో భాగంగా హైదరాబాద్ హిమాయత్ నగర్ వై జంక్షన్లో ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతరేకంగా పెద్దఎత్తున నినదించారు. అలాగే, విద్యుత్ కార్మికులు విద్యుత్ సౌదాల్లో నిరసన సభ నిర్వహించారు.