చిక్కడపల్లి/వరంగల్ చౌరస్తా/నిజామాబాద్, నవంబర్ 19: వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న విధంగానే విద్యుత్తు సవరణ చట్టాలనూ, నాలుగు కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలని ప్రముఖ సినీనటుడు ఆర్ నారాయణమూర్తి డిమాండ్చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న నేపథ్యంలో తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ ఇతర సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సుందర య్య విజ్ఞాన కేంద్రం వద్ద సంబురాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతుల కోసం 24 గంటలు ఉచిత విద్యుత్తు అందిస్తున్నారని చెప్పారు. ఈ విద్యుత్తు సవరణ చట్టాలతో ఉచిత కరెంటుకు కోత పడే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఢిల్లీలో నిరవధికంగా సమ్మె చేసిన రైతులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని, మరణించిన రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, ఉపాధ్యక్షుడు అరిబండి ప్రసాద్, ఆల్ ఇండియా కిసాన్సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ప్రధా నకార్యదర్శి సాయిబాబు, కార్యదర్శులు ఎస్ రమ, పాలడుగు భాస్కర్, జే వెంకటేశ్ పాల్గొన్నారు.
వరంగల్ ప్రధాన తపాలా కార్యాలయ జంక్షన్లో ఏఐకేఎస్సీసీ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐకేఎస్సీసీ జిల్లా కమిటీ కన్వీనర్ పెద్దారపు రమేశ్, జిల్లా కమిటీ కోకన్వీనర్లు సోమిడి శ్రీనివాస్, రాచర్ల బాలరాజు, బీరం రాములు పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు పలుచోట్ల పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు.
ఇది రైతులు సాధించిన చరిత్రాత్మక విజ యం. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే మొక్కవోని దీక్షతో పోరాడుతున్న రైతుయోధులకు అభినందనలు. కేంద్రం తెలంగాణలో పండిన మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలి.- చాడ వెంకట్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
రైతు, కార్మిక సంఘాలు, కమ్యూనిస్టుల సుదీర్ఘ ఐక్యపోరాటంతో బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను ఉపసంహరించుకున్నది. ఈ చట్టాలను పార్లమెంటులో రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని ఏఐకేఎస్సీసీ ప్రకటించడం పోరాట పటిమకు నిదర్శనం.- టీ వెంకట్రాములు, కే కాంతయ్య, తాటి వెంకటేశ్వర్రావు బీకేఎంయూ నేతలు
ఇది రైతుల, ప్రజా ఉద్యమాల చారిత్రక విజయం. విద్యుత్తు సవరణ బిల్లును ఉపసంహరించాలి. నిరంకుశ మోదీ చివరకు ప్రజా ఉద్యమానికి తలవంచక తప్పలేదు.-పశ్య పద్మ, టీ సాగర్, కన్నెగంటి రవి, అఖిల భారత రైతుపోరాట సమన్వయ కమిటీ
రైతుల సుదీర్ఘ పోరాటానికి దక్కిన ఘన విజయం. పట్టువదలని ప్రజా ఉద్యమాలు, బ్యాలెట్ పోరాటాలు కలిసి కార్పొరేట్ అనుకూల నియంతృత్వ ప్రభుత్వాలను నిలువరించగలవని రుజువైంది. ఈ ఉద్యమంలో దాదాపు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. రైతుల మరణానికి కారణమైన ప్రధాని మోదీ దేశానికి క్షమాపణ చెప్పాలి. వారి కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాలి. దేశవ్యాప్తంగా 30 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 15 చోట్ల ఓడిపోయింది. దీంతో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు కొంచెం తగ్గించారు. పంజాబ్ ఎన్నికల కోసం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించబోతున్నారు. – సురవరం సుధాకర్రెడ్డి, సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి