సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తేతెలంగాణ) : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నగరంలో డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నించిన మూడు అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.20 లక్షలు విలువజేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. హైదరాబాద్ను డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు డ్రగ్స్ స్మగ్లర్లు ఎక్కడున్నా పట్టుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం చేశారు.
డ్రగ్స్ ముఠాల వివరాలను గురువారం ఆయన వివరించారు. నైజీరియాకు చెందిన డ్రగ్స్ విక్రేత టోనీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో తమ ఏజెంట్లను నియమించుకొని కొకైన్, ఇతర డ్రగ్స్ను సరఫరా చేస్తున్నాడు. నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయాలు జరిగేందుకు అవకాశాలున్నాయని సమాచారం రావడంతో నార్త్జోన్, వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా పెంచారు.
ఈ క్రమంలో టోనీ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో టాస్క్ఫోర్స్ బృందాలు ముంబయికి వెళ్లి ప్రధాన సూత్రధారి టోనీని పట్టుకునేందుకు ప్రయత్నించింది. అక్కడ వసై ప్రాంతంలో 10 వేలమంది వరకు నైజీరియా దేశస్తులు నివాసముంటున్నారు. అందరిలో ఉంటూ టోనీ ఈ స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. నైజీరియాకు చెందిన మొబైల్ నెంబర్ను ఉపయోగిస్తూ, తన ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతున్నాడు. ఇందులో భాగంగా ముంబయి అంధేరికి చెందిన ఇమ్రాన్బాబు షేక్ను ఏజెంట్గా, ఉత్తర్ప్రదేశ్కు చెందిన నూర్ మహ్మద్ఖాన్ను సబ్ ఏజెంట్గా నియమించుకున్నాడు.
ఈ ఇద్దరు తెలంగాణ, ఏపీలలో డ్రగ్స్ సరఫరా చేస్తుంటారు. టోని కోసం ముంబయిలో వెతుకుతుండగా అతని ఏజెంట్లు హైదరాబాద్కు బయలుదేరినట్లు సమాచారం అందింది. టోని ఆదేశాలతో ఇమ్రాన్ 100 గ్రాముల డ్రగ్స్ తీసుకొని నూర్తో పంజాగుట్టలోని ఓయో హోటల్స్లో దిగి తమ వినియోగదారులకు ఒక్కో గ్రాము రూ.10 వేలకు విక్రయించాలని ప్లాన్ చేశారు.
ఈ ఇద్దరిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో జీవీకే మాల్ వద్ద పట్టుకొని వారినుంచి 83 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. మిగతాది అప్పటికే విక్రయించినట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. ప్రధాన సూత్రధారి టోనిని పట్టుకునేందుకు ముంబయికి వెళ్లి అక్కడి పోలీసుల సహకారం తీసుకుంటామని సీపీ వెల్లడించారు. డ్రగ్స్ విక్రయించేవారితోపాటు డ్రగ్స్ తీసుకునే వారిపై నిఘా పెంచామని వివరించారు.
సరఫరాదారులే కాదు వినియోగదారులపై కేసులు
ఇప్పటివరకు సరఫరాదారులపైనే దృష్టి పెట్టాం, ఇకనుంచి మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న వారిపై కూడా కేసులు నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని సీపీ ఆనంద్ వెల్లడించారు. దీనిపై మానసిక నిపుణులతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. మూడు ముఠాలలో ఏడుగురిని అరెస్ట్ చేశామని, వీరినుంచి ఆరుగురు మాదకద్రవ్యాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారని వివరించారు. డ్రగ్స్ విక్రయించే వారితోపాటు వాటిని ఉపయోగిస్తున్న వారిని కూడా అరెస్ట్ చేస్తే నగరంలో మత్తు పదార్థాల కట్టడి సాధ్యమవుతుందని సీపీ పేర్కొన్నారు.