శ్రీశైలం : కొవిడ్ ఉధృతి నేపథ్యంలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రంలో అధికారులు ఆంక్షలను అమలులోకి తీసుకువచ్చారు. దేవాదాయశాఖ ఆదేశాల మేరకు స్వామివారి గర్భాలయ దర్శనం (స్పర్శ దర్శనం), గర్భాలయ అభిషేకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం దేవస్థానంలో కొవిడ్ నియంత్రణ చర్యలపై ఈవో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్గదర్శకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అయితే, ప్రస్తుతం సేవా టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు పునరుద్ధరించిన తర్వాత.. కోరుకున్న రోజున అభిషేకాలు నిర్వహించుకునే అవకాశం ఇస్తున్నట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు.
ప్రస్తుతం లఘు దర్శనం మాత్రమే కలిపిస్తున్నామని, శఠారి, తీర్థం, ఉచిత ప్రసాదం పంపిణీ సైతం నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. గంటకు కేవలం వెయ్యి మంది భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. పరిమిత సంఖ్యలో ఆర్జిత సేవలు జరుగుతాయన్నారు. అందుబాటులో ఉన్న ఆర్జిత సేవల్లో ప్రస్తుతం జారీ చేస్తున్న టికెట్లలో 50శాతం టికెట్లను విక్రయించనున్నట్లు పేర్కొన్న ఆయన.. అవి కూడా ఆన్లైన్లోనే తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నెల 18 నుంచి తాత్కాలికంగా ఆర్జితసేవా టికెట్ల జారీ నిలిపివేస్తున్నట్లు చెప్పారు. శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం టికెట్లను సైతం భక్తులు దేవస్థానం వెబ్సైట్ Srisalladevasthanam.org తీసుకోవాలన్నారు. అయితే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో కొవిడ్ వ్యాక్సినేషన్ వివరాలను సైతం నమోదు చేయాల్సిందేనన్నారు. సామూహిక ఆర్జిత అభిషేకాలు రోజుకు నాలుగు విడతలుగా జరుగుతాయని, ఒక్కో విడుతలో 75 టికెట్లు జారీ చేయనున్నట్లు ఈవో తెలిపారు. టికెట్లు తీసుకున్న భక్తులకు కేవలం స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు.
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చంటిపిల్లల తల్లులు, పది సంవత్సరాలోపు వయసున్న పిల్లలను క్షేత్రానికి రావ్వొద్దని ఈవో లవన్న కోరారు. భక్తులు తమకు కేటాయించిన నిర్ధిష్ట సమయంలో మాత్రమే దర్శనం, ఆర్జిత సేవలకు రావాలన్నారు. దర్శనానికి వచ్చే సమయంలో మాస్క్ తప్పనిసరని, ఎట్టి పరిస్థితుల్లో మాస్క్ లేని వారిని దర్శనానికి అనుమతించమని స్పష్టం చేశారు. క్యూలైన్లోనూ భౌతిక దూరం పాటించాలని, క్యూలైన్లో ప్రవేశించే ముందు తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవాలన్నారు. జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలున్న వారిని ఆలయంలోకి అనుమతించే అవకాశం ఉండదన్నారు. భక్తులు ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగతంగా శానిటైజర్లు వెంట తెచ్చుకోవాలని కోరారు.
క్షేత్రంలో భక్తులకు ఉచిత అన్నప్రసాద పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈవో తెలిపారు. ఈ పరిస్థితుల్లో భక్తులు ఎక్కువ రోజులు శ్రీశైలంలో ఉండకుండా.. దర్శనానంతరం స్వస్థలాలకు వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత వరకు ఒక రోజు వరకే క్షేత్ర పర్యటన ఉండేలా చూసుకోవాలన్నారు. అలాగే పాతాళగంగలో స్నానాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అలాగే రోప్వే, బోటింగ్ను సైతం నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. తలనీలాలు సమర్పించే భక్తుల కోసం కొవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేశామన్నారు. దేవదాయ శాఖ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఆలయాన్ని శానిటైజ్ చేయనున్నట్లు ఈవో తెలిపారు. సమావేశంలో అర్చకులు, సీనియర్ వేదపండితులు, అన్ని విభాగాల అర్చకులు, పోలీస్, రెవెన్యూ, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.