హైదరాబాద్, జనవరి 29 : రాష్ట్రంలో శనివారం 3,590 కేసులు వెలుగుచూశాయి. శుక్రవారంతో పోల్చితే 87 కేసులు తగ్గాయి. కరోనా, ఇతర కారణాలతో ఇద్దరు మరణించారు. మరోవైపు థర్డ్వేవ్లో మొదటిసారిగా కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయినవారి సంఖ్య మూడువేలు దాటింది. శనివారం 3,555 మంది కోలుకొని ఇంటికి వెళ్లినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్లో పేర్కొన్నది. దీంతో రికవరీ రేటు కాస్త పెరిగి 94.13 శాతంగా నమోదైంది. శనివారం అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,160, మేడ్చల్ మల్కాజిగిరిలో 257, రంగారెడ్డిలో 215, హనుమకొండలో 132, ఖమ్మంలో 121, కరీంనగర్లో 119, సంగారెడ్డిలో 118, సిద్దిపేటలో 115, భద్రాద్రి కొత్తగూడెంలో 105 కేసులు వెలుగుచూశాయి.
శనివారం రాష్ట్రవ్యాప్తంగా 2.45 లక్షల మందికి టీకాలు వేశారు. ఇందులో 48 వేల మందికి మొదటిడోస్, 1.87 లక్షల మందికి రెండో డోస్, దాదాపు 9వేల మందికి బూస్టర్ డోస్ వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19.62 లక్షల డోసులు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్లో కలిపి 53,610 పడకలు అందుబాటులో ఉన్నాయి.