తిరువనంతపురం : కేరళలో కొవిడ్ పరిస్థితులపై కేంద్ర మంత్రి మురళీధరన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం మహమ్మారిని ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కేరళలో పరిస్థితి విషమంగా ఉంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకట్టడానికి శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించే బదులు.. రాజకీయ లబ్ధికి కోసం మహమ్మారిని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మార్గదర్శకాలు అనుసరించాలి. కేరళ హోమ్ క్వారంటైన్ (ప్లాన్) ఘోరంగా విఫలమైంది. కొవిడ్ నియంత్రణపై రాష్ట్రం మరింత శ్రద్ధ వహించాలి’ అన్నారు. భవిష్యత్లో మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు కేరళ అధిక కేసుల భారాన్ని ఎదుర్కొంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య సంక్షోభాన్ని తగ్గించడానికి రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం ఏమీ చేయలేదని, దాన్ని కప్పిపుచ్చుకోవడంలో బిజీగా ఉందని బీజేపీ ఆరోపించింది. ఇదిలా ఉండగా.. కేరళ బుధవారం 31,445 కొత్త కొవిడ్ కేసులు నమోదగా.. 215 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38,83,429కు చేరగా.. మరణాలు 19,972కు పెరిగాయి.